ముగ్గురు ప్లేయర్స్ దూరం:
భారత జట్టు ప్రస్తుతం రెండు దేశాల్లో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని ప్రధాన జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉండగా.. శిఖర్ ధావన్ సారథ్యంలోని యువ టీమిండియా శ్రీలంక పర్యటనలో ఉంది. ఇప్పటికే లంకలో వన్డే సిరీస్ ముగియగా.. ఇంగ్లండ్తో ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 వరకూ ఐదు టెస్టుల సిరీస్ జరగనుంది. ఇంగ్లండ్ పర్యటనకి వెళ్లిన యువ ఓపెనర్ శుభమన్ గిల్, ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్తో పాటు స్టాండ్ బై బౌలర్ అవేష్ ఖాన్ గాయపడి సిరీస్కి దూరమయ్యారు. గిల్ ముందుగా గాయపడగా.. టీం మేనేజ్మెంట్ అతడి స్థానానికి పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్లను పంపాల్సిందిగా బీసీసీఐని కోరింది. ఆటగాళ్ల స్థానాల భర్తీకి బీసీసీఐ అప్పుడు ఒప్పుకోలేదు.
వెనక్కి తగ్గిన బీసీసీఐ:
శుభమన్ గిల్ అనంతరం వాషింగ్టన్ సుందర్తో పాటు అవేష్ ఖాన్ గాయపడ్డారు. దీంతో బీసీసీఐ కూడా వెనక్కి తగ్గింది. పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్, జయంత్ యాదవ్ను ఇంగ్లండ్ పంపేందుకు బీసీసీఐ సముఖంగా ఉన్నట్టు సమాచారం. శ్రీలంక పర్యటనలో ఉన్న షా, సూర్య.. మూడు టీ20ల సిరీస్ అనంతరం ఇంగ్లండ్కి బయల్దేరి వెళ్లనున్నారట. అలానే ప్రస్తుతం భారత్లో ఉన్న జయంత్ యాదవ్ కూడా ఈ ఇద్దరితో వెళ్లనున్నాడు. గిల్ స్థానం భర్తీకి షాని, సుందర్ స్థానం భర్తీ కోసం యాదవ్ని పంపబోతున్న బీసీసీఐ.. అవేష్ ఖాన్కి రీప్లేస్గా మాత్రం ఎవరినీ పంపబోమని చెప్పినట్లు తెలుస్తోంది. కండరాల గాయం నుంచి కోలుకుంటున్న వైస్ కెప్టెన్ అజింక్య రహానేకి స్టాండ్ బైగా మాత్రమే సూర్య వెళ్లనున్నాడు.
లంక పర్యటన తర్వాతే:
శ్రీలంకతో టీ20 సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్, పృథ్వీ షాలను సిరీస్ ముగిసిన తర్వాత లేదా మధ్యలోనే యూకేకు పంపించాలా అనే విషయమై ప్రస్తుతం బీసీసీఐ చర్చిస్తున్నట్లు సమాచారం. దాదాపుగా లంక పర్యటన ముగిసిన అనంతరమే వీరు వెళ్లే అవకాశం ఉంది. శ్రీలంక పర్యటనలో ఉన్న శిఖర్ ధావన్ నేతృత్వంలోని భారత జట్టు.. 25 ,27, 29 తేదీల్లో 3 టీ20 మ్యాచ్లు ఆడనుంది. మరోవైపు ఇంగ్లండ్తో ఆగస్టు 4 నుంచి టెస్ట్ సిరీస్ ఆరంభం కానుంది.
ప్రాక్టీస్ మ్యాచ్ 'డ్రా':
కౌంటీ సెలెక్ట్ ఎలెవన్తో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ను భారత్ 'డ్రా'గా ముగించింది. గురువారం, మూడో రోజు ఆట ముగిసే సమయానికి కౌంటీ ఎలెవన్ రెండో ఇన్నింగ్స్లో 15.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 31 పరుగులు చేసింది. అంతకుముందు భారత్ 192/3 వద్ద రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 311 పరుగులు చేయగా.. కౌంటీ ఎలెవన్ 220 పరుగులు సాధించింది. జూలై 28 నుంచి రెండో వామప్ మ్యాచ్ జరగనుంది. అందులో విశ్రాంతి తీసుకున్న ప్లేయర్స్ ఆడే అవకాశం ఉంది.