

హైదరాబాద్: ఆసీస్ గడ్డపై చారిత్రక టెస్టు విజయాన్ని సొంతం చేసుకున్న టీమిండియాపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆసీస్ గడ్డపై సిరీస్ గెలవాలన్న దశాబ్దాల కల నెరవేరడంతో క్రికెట్, సినీ, రాజకీయ ప్రముఖులు కోహ్లీసేనపై ట్విటర్లో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ సైతం తన ట్విట్టర్లో టీమిండియాకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. "ఆస్ట్రేలియాలో ఓ చారిత్రక క్రికెట్ విజయమిది. ఈ అద్భుతమైన విజయానికి టీమిండియా సభ్యులు అన్ని విధాలుగా అర్హులు. సిరీస్లో కొన్ని అద్భుతమైన ప్రదర్శనలతోపాటు టీమ్ వర్క్ కనిపించింది" అని మోడీ ట్వీట్ చేశారు.
భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా ట్విట్టర్లో టీమిండియాకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
1947లో తొలిసారి ఆస్ట్రేలియాలో అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు టెస్ట్ సిరీస్ విజయం భారత్కు కలగానే మిగిలిపోయింది. అయితే, ప్రస్తుతం కోహ్లీ ఆ కలను నెరవేర్చాడు. వర్షం కారణంగా సిడ్నీ టెస్టు డ్రాగా ముగియడంతో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్ను 2-1తో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఫలితంగా ఆసీస్ గడ్డపై కోహ్లీ సేన సరికొత్త చరిత్రను సృష్టించింది. ఆసీస్ గడ్డపై టెస్టు సిరిస్ విజయంతో ఈ ఘనత సాధించిన తొలి భారత, ఆసియా కెప్టెన్గానూ విరాట్ కోహ్లీ రికార్డుల్లో నిలిచాడు. 72 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆస్టేలియాలో టెస్టు సిరీస్ గెలవడంతో భారత్ క్రికెటర్లు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు.