
గెలుపోటముల ఆధారంగా విమర్శలా:
ఈ క్రమంలో ఇంగ్లాండ్ గడ్డపై టెస్టు సిరీస్ని భారత్ జట్టు 1-4తో చేజార్చుకుందంటూ విమర్శలు వస్తూనే ఉన్నాయి. వీటిపై కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. ఐదు టెస్టుల ఈ సిరీస్లో భారత్ జట్టు పోరాడినా.. అభిమానులు దాన్ని మరిచిపోయి కేవలం గెలుపోటముల ఆధారంగా విమర్శలు గుప్పించడం తగదని కోహ్లీ సూచించాడు. ఓవల్ వేదికగా మంగళవారం చివరి టెస్టు ముగియగా.. 464 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా 345 పరుగులకే ఆలౌటైంది.

గెలుస్తుందనుకునేలోపే పరాజయంతో ముగింపు:
సిరీస్ తొలి రెండు టెస్టుల్లో 31 పరుగులు, ఇన్నింగ్స్ 159 పరుగుల తేడాతో ఓడిన భారత్ జట్టు.. మూడో టెస్టులో 203 పరుగుల తేడాతో గెలిచి పుంజుకుంది. కానీ.. నాలుగు, ఐదో టెస్టులో మళ్లీ ఓడిపోయి సిరీస్ను చేజార్చుకుంది. టెస్టు సిరీస్ ముగియడంతో బుధవారం మీడియాతో కాసేపు కోహ్లీ మాట్లాడాడు. తమ జట్టులోని బలాలను మినహాయించి ఏ లోపాలను బయటపెట్టకుండా జట్టుకు అండగా ఉంటూనే సమావేశాన్ని కొనసాగించాడు.

ఆతిథ్య జట్టుకి కలిసొచ్చిందదే:
‘ఏకపక్షంగా అభిమానులు టీమిండియాను ఎలా విమర్శిస్తున్నారో..? మీరే చూస్తున్నారు కదా..! వారంతా సిరీస్లో భారత్ జట్టు పోరాటాన్ని మరిచారు. కొన్ని సందర్భాల్లో మేము ఒత్తిడిని అధిగమించలేకపోయాం. అదే ఆతిథ్య జట్టుకి కలిసొచ్చింది. సిరీస్లో భారత క్రికెటర్లు సరిదిద్దుకోవాల్సిన పెద్ద తప్పిదాలు ఏవీ నాకు కనిపించలేదు. టీమిండియా ప్రదర్శనపై మీకు సందేహాలు అవసరం లేదు. మా జట్టుకి మ్యాచ్లు గెలిసే సామర్థ్యం ఉంది' అని కోహ్లీ ఘాటుగా వెల్లడించాడు.

రాహుల్, పంత్ సెంచరీతో భారత్ను:
చివరి టెస్టులో అద్భుతమైన ఆటతీరుతో భారత బ్యాట్స్మెన్ పోరాటం ఆకట్టుకుంది. ముఖ్యంగా ఓపెనర్ కేఎల్ రాహుల్ (149), రిషబ్ పంత్ (114) అద్భుత బ్యాటింగ్తో ఇంగ్లాండ్ను వణికించారు. ఓవర్నైట్ స్కోరు 58/3తో చివరి రోజు ఆట ప్రారంభించిన భారత్ను రాహుల్, పంత్ సెంచరీతో ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్కు 204 పరుగులు జోడించి భారత శిబిరంలో ఆశలు రేపారు.


Click it and Unblock the Notifications












