మొహసిన్ ఖాన్ రాజీనామా
ఆయన పదవీ కాలం ఇంకా ఉండగానే.. అర్ధాంతరంగా తప్పుకొన్నారు. పదవి నుంచి వైదొలగాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ ఎహసాన్ మణి ఆదేశించిన కారణంగానే ఆయన తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. మొహసిన్ హసన్ ఖాన్ స్థానంలో వసీం ఖాన్ను క్రికెట్ కమిటీ ఛైర్మన్గా నియమించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. వసీం ఖాన్ ప్రస్తుతం ఇదే కమిటీకి మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. మొహసిన్ ఖాన్ తన హయాంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు కోసం అనేక త్యాగాలు చేశారని ఈ సందర్భంగా ఎహసాన్ మణి కొనియాడారు. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని చెప్పారు.
అవమానకర ఓటమి
మొహసిన్ ఖాన్ మాజీ టెస్ట్ క్రికెటర్ కూడా. ఇదివరకు పాకిస్తాన్ తరఫున పలు అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ను ఆడారాయన. క్రికెట్ నుంచి విరమణ అనంతరం ఆయన సేవలను వినియోగించుకుంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఆయనను క్రికెట్ కమిటీ ఛైర్మన్గా నియమించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రపంచకప్ సహా మూడేళ్లుగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఆటతీరు ఆశించిన స్థాయిలో లేదని ప్రభుత్వం భావిస్తోంది. కనీస సంతృప్తికర స్థాయిలో జట్టు ఆటగాళ్లు ఆడట్లేదని నిర్ణయానికి వచ్చింది. మాంఛెస్టర్లోని ఓల్డ్ ట్రాఫొర్డ్లో భారత్తో అత్యంత అవమానకరంగా ఓటమి పాలు కావడాన్ని జీర్ణించుకోలేకపోయింది. అందుకే- క్రికెట్ బోర్డులో ప్రక్షాళణకు తెర తీసింది. ఆయన స్థానాన్ని మిస్బా ఉల్ హక్ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ప్రక్షాళణ ఆరంభించినట్టేనా
మొదటగా- మొహసిన్ ఖాన్పై వేటు వేసింది. కాగా- మొహసిన్ స్థానంలో వసీం ఖాన్ను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన క్రికెట్ కమిటీకి మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. కొద్దిరోజుల కిందటే ఆయన ఆ పదవిలో నియమితులయ్యారు. ఇదిలావుండగా-ప్రపంచకప్ ముగిసిన తరువాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో భారీ మార్పులు, చేర్పులు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కొన్ని పెద్ద తలకాయలు సైతం లేచిపోయే అవకాశాలు ఉన్నాయి.
ఇందులో భాగంగా- తొలి వేటు కోచ్ మిక్కీ అర్థర్పై పడొచ్చని చెబుతున్నారు. మిక్కీ అర్థర్ కాంట్రాక్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పునరుద్ధరించకపోవచ్చని సమాచారం. మిక్కీ అర్థర్ తరువాత తరువాతి వేటు చీఫ్ సెలెక్టర్, మాజీ బ్యాట్స్మెన్ ఇంజమామ్ ఉల్ హక్ పడే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. ఇంజమామ్ నేతృత్వంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టులో విభేదాలు తలెత్తాయని, గ్రూపిజం ఏర్పాటైందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భావిస్తోంది.