
హైదరాబాద్: పాక్ ప్రధానమంత్రిగా ఇమ్రాన్ ఖాన్ బాధ్యతలు చేపట్టాక ఆ దేశ క్రికెట్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ పదవికి నజీమ్ సేథీ రాజీనామా చేశారు. ఆయన పదవీకాలం 2020 వరకు ఉన్నా, అనూహ్యంగా పదవి నుంచి తప్పుకొన్నారు.
నజీమ్ సేథీ స్థానంలో ఐసీసీ మాజీ చీఫ్ ఎహ్సాన్ మణిని చైర్మన్గా నామినేట్ చేస్తున్నట్టు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేశారు. క్రికెట్లో మంచి అనుభవం ఉన్న మణి పీసీబీ చాకచక్యంగా నడుపుతాడని ఇమ్రాన్ అందులో పేర్కొన్నారు. ఇమ్రాన్తో సత్సంబంధాలు లేకపోవడమే సేథీ రాజీనామాకు కారణమని తెలుస్తోంది.
2017 ఆగస్టులో పీసీబీ చైర్మన్గా నజామ్ సేథీ బాధ్యతలు స్వీకరించారు. సేథీని పీసీబీ గవర్నింగ్ బాడీ ఏకగీవ్రంగా ఎన్నుకుంది. ఆగస్టు 16లోగా తన పదవికి రాజీనామా చేయాలని పీసీబీ చైర్మన్, జర్నలిస్ట్ నజీమ్ సేథీని ఆదేశించినట్టు సమా టీవీ ఓ కథనంలో పేర్కొంది.
అయితే, తన రాజీనామాపై సేథీ మాట్లాడుతూ "నేనే పీసీబీ పదవికి రాజీనామా చేస్తూ లేఖను ప్రధానికి సమర్పించడకోసం కొన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నా. సోమవారం నా రాజీనామాను సమర్పించాను. పీసీబీ ఆల్ ది బెస్ట్. మన క్రికెట్ ఉన్నతి శిఖరాలను అధిరోహిస్తుందని ఆశిస్తున్నా" అని అన్నారు.
కాగా, 2013లో పీఎంఎల్(ఎన్) ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సేథీ రిగ్గింగ్కు సాయపడ్డాడని ఇమ్రాన్ ఖాన్ అప్పట్లో ఆరోపణలు చేశారు. దీంతో అవకాశం దొరికినప్పుడల్లా నజీం సేథీపై ఇమ్రాన్ ఖాన్ మండిపడుతున్నాడు. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ ప్రధాని కావడంతో సేథీపే వేటు పడింది.