బర్మింగ్హామ్ : ఎడ్జ్బాస్టన్లో రీషెడ్యూల్ చేసిన అయిదో టెస్ట్ మ్యాచ్లో మొదటి రోజు ఉత్తేజకరంగా సాగిందని అభిప్రాయపడ్డ ఇంగ్లాండ్ అసిస్టెంట్ కోచ్ పాల్ కాలింగ్వుడ్.. రిషబ్ పంత్ వరల్డ్ క్లాస్ ప్లేయర్ అంటూ ప్రశంసించాడు. పంత్లాంటి ఉత్సాహవంతమైన ప్లేయర్లను చూస్తుంటే.. ఆటోమేటిక్గా చప్పట్లు కొట్టాలనిపిస్తుందని కాలింగ్వుడ్ పేర్కొన్నాడు. భారత వికెట్ కీపర్ కం బ్యాటర్ అయిన రిషబ్ పంత్ తొలి రోజున ఇంగ్లాండ్ బౌలర్లపై తన ప్రతాపాన్ని చూపించి.. ఇండియాకు గౌరవప్రదమైన స్కోరు అందించే ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే. టీ20 తరహా బ్యాటింగ్తో 111బంతుల్లోనే 146 పరుగులు చేసి రఫ్ఫాడించాడు. ఒకానొక దశలో 98పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఇండియా తొలి రోజు ముగిసే సరికి 7 వికెట్లు కోల్పోయి 338పరుగులు చేసిందంటే అందుక్కారణం రిషబ్ పంత్. ఇక అతను 6వికెట్కు రవీంద్రా జడేజా (83నాటౌట్)తో కలిసి 222పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
ఇక ఈ మ్యాచ్ తొలి రోజు అనంతరం కాలింగ్వుడ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. 'ఈ రోజు చాలా ఫంటాస్టిక్ డే. రిషబ్ పంత్ ఆడిన విధానం అమోఘం. పంత్ లాంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్లకు ప్రత్యర్థులుగా ఆడడం చాలా ఆనందంగా ఉంటుంది. అప్పుడే ప్రపంచ స్థాయి ప్రదర్శనలను మనం చూడొచ్చు. ఇది టెస్ట్ క్రికెట్కు సంబంధించి మరొక ఉత్తేజకరమైన రోజు. మేం న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల సిరీస్లో అద్భుతంగా గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేసుకున్నాం. ఇక మా జట్టుకు ప్రధాన కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ వచ్చాక తాను టెస్ట్ క్రికెట్ విషయంలో వైవిధ్యాన్ని చూస్తున్నానని, టెస్ట్ క్రికెట్ మనుగడ సాగించడానికి మేం దాన్ని మరింత వినోదాత్మకంగా మార్చాలనుకుంటున్నాం. తొలి రోజు మా బౌలర్లు తప్పు చేశారని నేను చెప్పను. ఎందుకంటే 30-40 ఓవర్ల తర్వాత బంతి తన స్వింగ్ కోల్పోయి సాఫ్ట్ అవుతుంది. అప్పుడు వికెట్లు తీయడం చాలా కష్టంగా ఉంటుంది' అని కాలింగ్వుడ్ తెలిపారు.