హోబర్ట్ : ఈ ఏడాది అక్టోబర్ నెలలో ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ వాయిదా పడితే.. దాని స్థానంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ నిర్వహిస్తే బాగుంటుందని ఆసీస్ స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ అభిప్రాయపడ్డాడు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ జరుగాలని తాను కోరుకునేందుకు చాలా కారణాలు ఉన్నాయని కమిన్స్ చెప్పాడు. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 18న టీ20 ప్రపంచకప్ ప్రారంభం కావాలి.
'అర్జున' అవార్డు రేసులో రాహుల్!!
ప్యాట్ కమిన్స్ బుధవారం మాట్లాడుతూ... 'టీ20 ప్రపంచకప్ వాయిదా పడితే.. దాని స్థానంలో ఐపీఎల్ 2020 నిర్వహిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అయితే ఐపీఎల్ జరుగాలని నేను కోరుకునేందుకు చాలా కారణాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఈ టోర్నీని చూస్తారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా క్రికెట్ చాలా కాలంగా నిలిచిపోయింది. ఈ సమయంలో ఐపీఎల్ జరిగితే ఎక్కువ ఆదరణ లభిస్తుంది. ఈ టోర్నీ చాలా గొప్పది. వీలైంత త్వరగా మళ్లీ క్రికెట్ ఆడాలని ఎదురుచూస్తున్నా' అని పేర్కొన్నాడు.
ఐపీఎల్ -13వ సీజన్ కోసం గతేడాది డిసెంబర్లో జరిగిన వేలంలో ఆసీస్ పేసర్ ప్యాట్ కమిన్స్ అత్యధిక ధరకు అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే. అతని కనీస ధర రెండు కోట్లు కాగా.. రసవత్తర పోటీ ఉండడంతో చివరకు రూ. 15.50 కోట్లు వెచ్చించి కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) దక్కించుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విదేశీ ఆటగాడిగా కమిన్స్ గుర్తింపు పొందాడు. కమిన్స్ బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలడు. అద్భుత బంతులతో మేటి బ్యాట్స్మెన్ను కూడా ముప్పుతిప్పలు పెట్టగలడు. మంచి లైన్ అండ్ లెంగ్త్తో వేసే బంతులకు అత్యుత్తమ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ లాంటి వారి వద్ద సమాధానం ఉండదు. ఇక అవసరం అయినపుడు బ్యాటుతోనూ మెరవగలడు. ప్రస్తుతం కమిన్స్ కెరీర్లోనే ఎప్పుడూ లేనంత ఫామ్లో ఉన్నాడు. అందుకే అతడి కోసం ప్రాంఛైజీలు పోటీ పడ్డాయి.
ఈ ఏడాది అక్టోబర్ 18వ తేదీ నుంచి నవంబర్ 15వ వరకు ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ జరగాల్సి ఉండగా.. కరోనా వైరస్ తీవ్రత కారణంగా టోర్నీ వాయిదా పడడం ఖాయంగా కనిపిస్తున్నది. బోర్డు సభ్యులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా పొట్టి ప్రపంచకప్ నిర్వహణ అంశంపై ఐసీసీ ఈ రోజు చర్చించనుంది. 'టీ 20 ప్రపంచకప్ను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువ గా ఉన్నాయి. అయితే ఆ నిర్ణయాన్ని ఐసీసీ ఇప్పుడే ప్రకటిస్తుందా లేదా అన్నదే ప్రశ్నగా ఉంది' అని ఐసీసీ బోర్డు సభ్యుడొకరు బుధవారం చెప్పారు.