

హైదరాబాద్: ఆసియాకప్లో టోర్నీలో భాగంగా బుధవారం దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్-పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో అనుకోని సంఘటన ఒకటి చోటు చేసుకుంది. టోర్నీలో భాగంగా జరుగుతున్న ప్రతి ఒక్క మ్యాచ్లో పాల్గొనే జట్ల జాతీయ గీతాలను ఆలపించడం ఆనవాయితీ వస్తోంది.
భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ ఆరంభానికి ముందు ఇరు జట్ల సభ్యులు ఫీల్డ్లోకి వెళ్లిన తర్వాత తమ దేశాల జాతీయ గీతాన్ని ఆలపించారు. అయితే, భారత జాతీయ గీతం వస్తోన్న సందర్భంలో పాకిస్థాన్కు చెందిన పలువురు అభిమానులు సైతం అందుకు తమ శృతిని జత చేశారు.
అంతేకాదు పాక్ అభిమానులు నిలబడి మరీ భారత గీతాన్ని ఆలపించడం ఈ మ్యాచ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనిపై పలువురు నెటిజన్లు వారిని అభినందిస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో పాక్పై టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో భారత బౌలర్లు చెలరేగడంతో పాకిస్థాన్ 162 పరుగులకే కుప్పకూలింది. పాకిస్థాన్ నిర్దేశించిన 163 పరుగుల విజయ లక్ష్యాన్ని టీమిండియా 29 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.
అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు భారత బౌలర్లలో భువనేశ్వర్ (3/15), కేదార్ జాదవ్ (3/23), బుమ్రా (2/23) విజృంభించడంతో 43.1 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. తాజా విజయంతో టోర్నీ సూపర్-4లోకి ప్రవేశించిన భారత్ జట్టు తర్వాత మ్యాచ్ శుక్రవారం బంగ్లాదేశ్తో తలపడనుంది.