సెమీస్కు కివీస్:
అనంతరం బంగ్లాను 7 పరుగులలోపు కట్టడి చేస్తే నాకౌట్ అవకాశం ఉన్నా.. అదీ సాధ్యం కాదని తేలిపోయింది. చివరకు పాక్ 94 పరుగులతో బంగ్లాదేశ్ను ఓడించింది. దీంతో న్యూజిలాండ్తో సమానంగా 11 పాయింట్లే సాధించినా.. నెట్రన్రేట్లో న్యూజిలాండ్ మెరుగ్గా ఉండడంతో సెమీస్ బెర్త్ దక్కించుకుంది. ఇక పాకిస్థాన్ నిరాశగా ఇంటిబాట పట్టింది.
షకీబ్ మరోసారి:
316 పరుగుల భారీ లక్ష ఛేదనలో బంగ్లాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు సౌమ్యా సర్కార్ (22 ), తమీమ్ ఇక్బాల్ (8) త్వరగానే పెవిలియన్ చేరారు. అనంతరం ముష్ఫికర్ (16) పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఇక స్టార్ ఆల్రౌండర్ షకీబ్ మరో అర్ధ సెంచరీ (77 బంతుల్లో 64; 6 ఫోర్లు)తో రాణించాడు. లిటన్ (32)తో కలిసి షకీబ్ నాలుగో వికెట్కు 58 పరుగులు జోడించి ఇన్నింగ్స్ను గాడిలో పెట్టే ప్రయత్నం చేసాడు. ఈ దశలో షాహిన్ ఆఫ్రిది చెలరేగడంతో.. లిటన్ ఔటైనా కాసేపటికే షకీబ్ కూడా వెనుదిరగడంతో బంగ్లా ఓటమి ఖాయమైంది. చివరకు బంగ్లా 44.1 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది. ఉత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేసిన షాహీన్ అఫ్రిదికి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది.
పేలవ ఆరంభం:
తొలుత పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. భారీ స్కోరు చేయాలనే లక్ష్యంతో బరిలో దిగిన పాకిస్థాన్కు ఆరంభం లభించలేదు. పవర్ ప్లే ముగిసేసరికి ఫఖర్ జమాన్ (31 బంతుల్లో 13) వికెట్ కోల్పోయి 38 పరుగులు చేసింది. మరో ఓపెనర్ ఇమామ్తో కలిసి బాబర్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన ఈ జోడీ కుదురుకున్నాక జోరు పెంచింది. ఈ క్రమంలో మొదట బాబర్ 62 బంతుల్లో.. అనంతరం ఇమామ్ 52 బంతుల్లో అర్ధ శతకాలు పూర్తి చేసుకున్నారు. ఈ జోడి రెండో వికెట్కు 157 పరుగులు జోడించారు.
బాబర్, ఇమామ్ ఆకట్టకున్నా:
సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో బాబర్ (96; 98 బంతుల్లో 11×4) ఔటయ్యాడు. హఫీజ్ (27) సహకారంతో సెంచరీ పూర్తి చేసుకున్న ఇమామ్ (100; 100 బంతుల్లో 7×4) ఆ వెంటనే హిట్వికెట్ అయ్యాడు. దీంతో ఒక దశలో 246/2తో పటిష్ఠంగా ఉన్న పాకిస్థాన్.. ఆ తర్వాత తడబడింది. మిడిలార్డర్లో ఇమాద్ వసీం (26 బంతుల్లో 43; 6 ఫోర్లు, 1 సిక్స్) ఒక్కడే రాణించాడు. హరీస్ సోహైల్ (6), సర్ఫరాజ్ (3 నాటౌట్), వహాబ్ (2) షాదాబ్ (1), ఆమిర్ (8) విఫలమయ్యారు. పాక్ 68 పరుగుల వ్యవధిలో 7 వికెట్లు కోల్పోయింది. బంగ్లా పేసర్ పేసర్ ముస్తఫిజుర్ (5/75) టోర్నీలో రెండోసారి ఐదు వికెట్లు పడగొట్టాడు.