19వ ఓవర్ బౌలింగ్ చేసిన కోహ్లీ:
2012లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన ఆల్రౌండర్ అల్బీ మోర్కెల్.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో అద్భుత ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్లో 7 బంతుల్లోనే 28 పరుగులు చేసి.. చెన్నైకి అద్భుత విజయాన్ని అందించాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వేసిన 19 ఓవర్లో 28 పరుగులతో చెలరేగాడు. కోహ్లీ కీలకమైన 19వ ఓవర్లో బౌలింగ్ చేయడంపై మోర్కెల్ స్పందించాడు. మ్యాచ్లో కోహ్లీ బౌలింగ్ చేయడాన్ని తాను ఊహించలేకపోయాన్నాడు.
6 బంతుల్లో 28 పరుగులు:
లీగ్ దశలో జరిగిన మ్యాచ్లో ముందు బ్యాటింగ్ చేసిన బెంగళూరు 206 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో కీలక వికెట్లు కోల్పోయిన చెన్నై పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక రెండు ఓవర్లలో 43 పరుగులు చేయాల్సిన స్థితిలో.. అప్పటి బెంగళూరు కెప్టెన్ డానియల్ వెటోరీ కోహ్లీకి బంతినిచ్చాడు. అప్పుడే క్రీజులోకి వచ్చిన అల్బీ.. ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగ పర్చుకుంటూ కోహ్లీ ఓవర్లో 28 పరుగులు రాబట్టి చెన్నైకి అద్భుత విజయాన్నందించాడు. కోహ్లీ ఓవర్లో అల్బీ మూడు సిక్సర్లు, రెండు ఫోర్లు బాదాడు.
కోహ్లీ చేతిలో బంతిని చూశాక:
స్పోర్ట్స్ ప్రెజెంటర్ రూపా రమణికి ఇచ్చిన ప్రత్యేక యూట్యూబ్ ఇంటర్వ్యూలో అల్బీ మోర్కెల్ మాట్లాడుతూ... 'ముందుగా బెంగళూరు భారీ స్కోర్ చేసింది. మేము కూడా బాగానే పోరాడాం. 18వ ఓవర్ చివరి బంతికి వికెట్ పడటంతో నేను క్రీజులోకి వచ్చా. అయితే ఆ సమయంలో 2 ఓవర్లలో 40కి పైగా పరుగులు చేయాల్సి ఉంది. ముందు అసాధ్యమే అనిపించింది. కానీ.. విరాట్ కోహ్లీ చేతిలో బంతిని చూశాక.. కొన్ని భారీ షాట్లు ఆడితే లక్ష్యానికి చేరువ కావొచ్చని భావించా' అని అన్నాడు.
ఎందుకు బౌలింగ్ చేశాడో తెలియదు;
'కోహ్లీ వేసిన ఆ ఓవర్లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు బాదడంతో మా పని సులువైంది. ఆ తర్వాత వినయ్ కుమార్ వేసిన చివరి ఓవర్లో డ్వేన్ బ్రావో కూడా భారీ షాట్లు ఆడడంతో మ్యాచ్ మా సొంతమైంది. కోహ్లీ బౌలింగ్ చేయడాన్ని తప్పు బట్టాలని కాదు కానీ.. అలాంటి కీలక సమయంలో అతడు బౌలింగ్ చేస్తాడని నేను అసలు ఊహించలేదు. కీలక సమయంలో ఎందుకు బౌలింగ్ చేశాడో తెలియదు' అని అల్బీ చెప్పుకొచ్చాడు.