హైదరాబాద్: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్తో తనకు ఎలాంటి పోటీ లేదని టెస్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా చెప్పాడు. గతేడాది భుజం గాయం సర్జరీ అనంతరం కోలుకుని వృద్ధిమాన్ సాహా ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బెంగాల్ తరుపున బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.
8000 ODI runs:ఢిల్లీ వన్డేలో రోహిత్ శర్మ ఖాతాలో మరో మైలురాయి
ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన సాహా పంత్ ఫామ్ కారణంగా తనకెలాంటి అభద్రతాభావం లేదని చెప్పాడు. పంత్ తనకు దొరికిన అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకున్నాడని సాహా ప్రశంసించాడు. ఇప్పుడు గాయం నుంచి పూర్తిగా కోలుకున్నానని.. తన దృష్టంతా తిరిగి ఫామ్లోకి రావడంపైనే ఉందని సాహా తెలిపాడు.
భుజం గాయం ఆపరేషన్ అనంతరం దాదాపు ఏడాది విరామం అనంతరం ముస్తాక్ అలీ ట్రోఫీలో బెంగాల్ తరుపున ఆడిన వృద్ధిమాన్ సాహా 11 మ్యాచ్ల్లో 306 పరుగులు చేశాడు. మార్చి 23 నుంచి ఆరంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2019 సీజన్లో సాహా సన్రైజర్స్ తరుపున ప్రాతినిథ్యం వహించనున్నాడు.
గత సీజన్లో సాహా పలు మ్యాచ్ల్లో సన్రైజర్స్ తరుపున ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా కూడా చక్కటి ప్రదర్శన చేశాడు. దీనిపై మాట్లాడుతూ "అవును, ఐపీఎల్లో ఓపెనర్గా బరిలోకి దిగాలని నాకు ఉంది. అయితే, అదంతా జట్టు మేనేజ్మెంట్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. చాలా నెలలు తర్వాత పునరాగమనం చేశాను. కాబట్టి ఐపీఎల్ సరైన వేదిక అని భావిస్తున్నా" అని సాహా చెప్పారు.