
హైదరాబాద్: నిదహాస్ ముక్కోణపు టీ20 సిరీస్లో భాగంగా శ్రీలంకతో తలపడిన భారత విజయాన్ని సాధించింది. ఉత్కంఠ పరిస్థితుల మధ్య విజేతగా నిలిచిన భారత్ పరువును దక్కించుకుంది. ఈ ట్రోఫీలో ఇరు జట్లు సమంగా రెండు పాయింట్లతోనే ఉన్న నేపథ్యంలో ఈ మ్యాచ్ కీలకంగా నిలిచి ఆధిక్యాన్ని తెచ్చిపెట్టింది.
సోమవారం జరిగిన మ్యాచ్లో నాలుగు వికెట్లతో మెరిసిన టీమిండియా గెలిచి చూపించింది. విజయంలో కీలక పాత్ర పోషించిన శార్దూల్ ఠాకూర్ తన ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ తరహా ప్రదర్శనను ఎక్కువగా ఇష్టపడతానన్న శార్దూల్ ఠాకూర్.. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నాడు.
మ్యాచ్ తర్వాత మాట్లాడిన శార్దూల్..' టీమిండియా విజయంలో ఎప్పుడూ భాగం కావాలనేది నా కోరిక. లంకేయులతో మ్యాచ్లో కొద్దిపాటి ఇబ్బందికి గురయ్యా. కాకపోతే ఒత్తిడిని దరిచేరనీయలేదు. దాంతోనే వికెట్లు తీయడం సాధ్యమైంది. మా ప్రణాళికలు పక్కాగా అమలు చేయడంతోనే విజయం సాధ్యమైంది. అంతకుమించి ఏమీ లేదు. నా ప్రదర్శన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే నథింగ్ స్పెషల్' అని శార్దూల్ అభిప్రాయపడ్డాడు.
లంకేయులతో జరిగిన మ్యాచ్లో శార్దూల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి నాలుగు కీలక వికెట్లను సాధించాడు. దాంతో లంకేయుల్ని 152 పరుగులకు కట్టడి చేయడం సులభతరమైంది.