హైదరాబాద్: శ్రీలంకలో మత హింస చెలరేగిన కారణంగా ఆ దేశంలో ఫేస్బుక్, వాట్సప్ సహా ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన నేతృత్వంలో మంగళవారం భేటీ అయిన కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి దిస్సనాయకే మీడియాకు తెలిపారు.
సోషల్ మీడియాపై నిషేధం విధంచడం వల్ల ప్రస్తుతం నిదాహాస్ ట్రోఫీ కోసం శ్రీలంకలో పర్యటిస్తోన్న భారత క్రికెటర్లు కాస్త ఇబ్బందిగా ఫీలయ్యారంట. భారత జట్టులోని ఆటగాళ్లు చాలా మంది ఆటగాళ్లు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సంగతి తెలిసిందే. ఈ నిషేధంతో వారు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోలేక పోతున్నామని వాపోతున్నారంట.
"నా మొబైల్కి వచ్చే వాట్సప్ మెసేజ్లను చూడగలుగుతున్నా, కానీ వాటిని చదవలేకపోతున్నా. కాల్స్ కూడా చేయలేకపోతున్నా. ఇది నిరాశకు గురి చేస్తోంది" అని మీడియాతో భారత జట్టులోని ఆ ఆటగాడు తన బాధను వెళ్లగక్కాడు. శ్రీలంకకు చెందిన టెలిఫోన్ ఆపరేటర్ డైలాగ్ టెక్ట్స్ మేసేజ్లను తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు పేర్కొంది.
"జాతీ భద్రతా ప్రయోజాలను దృష్టిలో పెట్టుకుని టీఆర్సీఎస్ఎల్ ఆదేశాల మేరకు సోషల్ మీడియా వెబ్ సైట్లు, మెసేజింగ్ ప్లాట్ఫామ్స్ను నిలుపుదల చేస్తున్నాం" అని పేర్కొంది. కాగా, క్యాండీ జిల్లాల్లో చెలరేగిన హింసను అదుపుచేయడంలో భాగంగా శ్రీలంక ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది.
మంగళవారం నుంచి 10 రోజుల పాటు ఎమర్జెన్సీ అమలులో ఉంటుందని ఆయన చెప్పారు. స్థానిక ముస్లింలు మత మార్పిడులకు ప్రయత్నిస్తున్నారని అక్కడి బౌద్ధ మతస్థులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం కాండీ జిల్లాలో కర్ఫ్యూ విధించారు. అక్కడి బౌద్ధులకు చెందిన ప్రాచీనాలయాలను ధ్వంసం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
లంకలో రోహింగ్యాలకు ఆశ్రయం కల్పించాలన్న వారి సంఖ్య పెరుగుతుండటంపై కూడా అక్కడి బుద్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాండీలోని ఓ ముస్లింకు చెందిన దుకాణానికి మంగళవారం కొందరు గుర్తు తెలియని దుండగులు నిప్పంటించడంతో గొడవ మొదలైంది.
నిదాహాస్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న ముక్కోణఫు టీ20 సిరిస్ కోసం రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా శ్రీలంకతో పర్యటిస్తోంది. ఈ టోర్నీలో భాగంగా గురువారం కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో సాయంత్రం 7 గంటలకు బంగ్లాదేశ్తో టీమిండియా తలపడనుంది. టోర్నీలో భాగంగా జరిగిన తొలి మ్యాచ్లో శ్రీలంక చేతిలో టీమిండియా ఓటమిపాలైంది.