హైదరాబాద్: మిడిల్ ఓవర్లలో పరుగులు రాబట్టడంలో విఫలమవ్వడమే తమ ఓటమికి ప్రధాన కారణమని శ్రీలంక తాత్కాలిక కెప్టెన్ తిషారా పెరీరా అభిప్రాయపడ్డాడు. కొలంబో వేదికగా సోమవారం భారత్తో జరిగిన మ్యాచ్లో శ్రీలంక 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
ముక్కోణపు టీ20 సిరిస్: లంకను చిత్తుగా ఓడించిన భారత్, ఫైనల్ బెర్త్ కన్ఫమ్
మ్యాచ్ అనంతరం పెరీరా మాట్లాడుతూ మ్యాచ్ ఆరంభంలో బ్యాటింగ్ బాగా చేసినప్పటికీ, మిడిల్ ఓవర్లలో పరుగులు రాబట్టడంలో విఫలమయ్యామని తెలిపాడు. ఇదే తమ ఓటమికి ప్రధాన కారణమని వెల్లడించాడు. ఇది 152 పరుగుల వికెట్ కాదని కూడా చెప్పాడు.
ఇంకా 30-25 పరుగులు వెనుకబడిపోయామని, 175 నుంచి 180 పరుగులు చేసి ఉంటే లక్ష్యాన్ని సులభంగా కాపాడుకోగలిగేవాళ్లమని చెప్పాడు. ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీ నమోదు చేసిన కుశాల్ మెండిస్ వికెట్ కోల్పోవడం కూడా మ్యాచ్ను మలుపు తిప్పిందని పేర్కొన్నాడు.
"కుశాల్ మెండిస్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఇంకా 30-25 పరుగులు చేయాల్సి ఉంది. ఇదే మా ఓటమికి కారణం. ఇక, బౌలింగ్లో తొలి ఆరు ఓవర్లలో తమ ప్రణాళికల్ని కచ్చితంగా అమలు చేయలేకపోయాం" అని పెరీరా అన్నాడు. ఈ ఓటమి విషయాన్ని పక్కకు పెట్టి తదుపరి మ్యాచ్కు సానుకూల ధోరణితో సిద్ధమవుతామని చెప్పాడు.
బంగ్లాదేశ్తో జరిగిన రెండో మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా రెగ్యులర్ కెప్టెన్ దినేశ్ చెండీమాల్పై రెండు మ్యాచ్ల నిషేధం విధించడంతో తాత్కాలిక కెప్టెన్గా పెరీరా బాధ్యతలు స్వీకరించాడు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 19 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది.
శ్రీలంక నిర్దేశించిన 153 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్ 17.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. తాజా విజయంతో శ్రీలంకతో ఆరంభ మ్యాచ్లో ఎదురైన ఓటమికి భారత్ బదులు తీర్చుకుంది. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కావడంతో 19 ఓవర్లకు కుదించిన సంగతి తెలిసిందే.