హైదరాబాద్: ఓటములతో సతమతమవుతున్న వెస్టిండిస్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. న్యూజిలాండ్తో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరిస్ నుంచి ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో చివరి నిమిషంలో టీ20 సిరిస్ నుంచి పొలార్డ్ తప్పుకున్నట్లు విండిస్ క్రికెట్ మేనేజ్మెంట్ ఓ ప్రకటనలో పేర్కొంది.
న్యూజిలాండ్తో జరగబోయే మూడు టీ20ల సిరిస్కు సెలక్టర్లు పొలార్డ్ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే చివరి నిమిషంలో వ్యక్తిగత కారణాల వల్ల పొలార్డ్ తప్పుకున్నట్లు విండీస్ కోచ్ హెస్సెన్ తెలిపారు. పొలార్డ్ స్థానంలో ఎడమచేతి బ్యాట్స్మన్ షిమ్రోన్ హేట్మెయిర్ను జట్టులోకి తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
గాయం కారణంగా ఇప్పటికే పేసర్ రాన్స్ఫోర్డ్ బీటన్ దూరమైన సంగతి తెలిసిందే. తాజాగా పొలార్డ్ కూడా దూరం కావడంతో ఈ సిరిస్లో విండిస్ ఏమేరకు రాణిస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే బీటన్ స్థానంలో జట్టులో చోటు దక్కించుకున్న షెల్డాన్ కాట్రెల్ త్వరలో జట్టుతో కలవనున్నాడు.
ప్రస్తుతం కివీస్ పర్యటనలో ఉన్న వెస్టిండిస్ టెస్టు, వన్డే సిరీస్లను కోల్పోయిన సంగతి తెలిసిందే. కనీసం టీ20 సిరీస్నైనా 3-0తో కైవసం చేసుకుని పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. శుక్రవారం నెల్సన్ వేదికగా జరిగే తొలి టీ20తో ఇరు జట్ల మధ్య మూడు టీ20ల సిరిస్ ప్రారంభం కానుంది.
వెస్టిండిస్ టీ20 జట్టు:
కార్లోస్ బ్రాత్వైట్ (కెప్టెన్), క్రిస్ గేల్, షిమోన్ హెట్మీర్, షాయ్ హోప్, జాసన్ మొహమ్మద్, ఆష్లీ నర్స్, రోవ్మన్ పావెల్, జెరోమ్ టేలర్, చాడ్విక్ వాల్టన్, కేస్క్ విలియమ్స్, శామ్యూల్ బద్రీ, షెల్డన్ కాటెరెల్, రాయడ్ ఎమిరి, ఆండ్రీ ఫ్లెచర్.