
హామిల్టన్: టీమిండియా ఫాస్ట్ బౌలర్, యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుత టాప్ బౌలర్లలో ఒకడు. బుమ్రాకి డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ అన్న టాగ్ లైన్ ఉన్న విషయం అందరికి తెలిసిందే. ఇన్నింగ్స్ చివరి ఓవర్లలో తన యార్కర్లతో ప్రత్యర్థి బ్యాట్స్మెన్లను బెంబేలెత్తిస్తాడు. అంతేకాదు పరుగులు చేయకుండా బ్యాట్స్మెన్ను కట్టడి చేస్తాడు. ఎలాంటి టాప్ క్లాస్ బౌలర్ కెరీర్లో తొలిసారి ఘోరంగా విఫలమయ్యాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు.
న్యూజిలాండ్తో హామిల్టన్ వేదికగా బుధవారం జరిగిన మూడో టీ20 మ్యాచ్లో కివీస్ బ్యాట్స్మెన్ ముందు బుమ్రా చేతులెత్తాశాడు. 180 పరుగుల లక్ష్య ఛేదనలో కివీస్ విజయానికి చివరి ఓవర్లలో (12 బంతుల్లో) 20 పరుగులు అవసరం. ఈ సమయంలో కోహ్లీ ఎంతో నమ్మకంతో బుమ్రాకి బంతిని ఇచ్చాడు. 19 ఓవర్లో రెండు ఫోర్లు సమర్పించుకోవడంతో పాటు ఏకంగా 11 పరుగులు ఇచ్చాడు. రాస్ టేలర్, కేన్ విలియమ్సన్ చెరో బౌండరీ బాదారు. దీంతో సమీకరణం ఒక్కసారిగా మారిపోయింది. చివరి ఓవర్లో షమీ 8 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు (టేలర్, కేన్) తీయడంతో మ్యాచ్ 'టై'గా ముగిసింది.
సూపర్ ఓవర్లోనూ మ్యాచ్ ఉత్కంఠంగా సాగింది. సూపర్ ఓవర్లో యార్కర్ కింగ్ బుమ్రా ప్రభావం చూపుతాడనుకుంటే.. పూర్తిగా తేలిపోయాడు. విలియమ్సన్ ఓ సిక్సర్, బౌండరీ బాదితే.. ఆఖరి బంతికి గప్తిల్ బౌండరీ సాధించడంతో కివీస్ 17 పరుగులు చేసింది. దీంతో టీమిండియా లక్ష్యం 18 పరుగులుగా మారింది. ఛేదనలో రోహిత్ శర్మ అద్భుతంగా ఆడి రెండు సిక్సులు బాదడంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది. మ్యాచ్ ఓడిపోతే మాత్రం బుమ్రా ఖాతాలోనే అపవాదు చేరేది.
2017లో గుజరాత్ లయన్స్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో సూపర్ ఓవర్ వేసిన బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 4 పరుగులే ఇచ్చాడు. 2019లో సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లోని సూపర్ ఓవర్లో 8 పరుగులు ఇచ్చాడు. ఈ రెండు మ్యాచ్ల్లోనూ ముంబై ఇండియన్స్ జట్టును బుమ్రా గెలిపించాడు. హామిల్టన్లో మాత్రం 17 పరుగులిచ్చి దారుణంగా విఫలమయ్యాడు. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు బుమ్రాను ఓ ఆటాడుకుంటున్నారు. బుమ్రా మునుపటిలా బౌలింగ్ చేయలేకపోతున్నాడు అని విమర్శల వర్షం కురిపిస్తున్నారు.