దుబాయ్: టీ20 ప్రపంచకప్ 2021 ఫైనల్ మ్యాచులో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి కివీస్ 172 పరుగులు చేసి.. ఆస్ట్రేలియాకు 173 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. న్యూజిలాండ్ను సారథి కేన్ విలియమ్సన్ (85: 10 ఫోర్లు, 3 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 10 ఓవర్ల వరకు స్వల్ప స్కోర్కే పరిమితం అయిన న్యూజిలాండ్.. 10 ఓవర్లు దాటాక స్కోర్ను అమాంతం పెంచేసింది. విలియమ్సన్ వరుసగా ఫోర్లు, సిక్సులు బాది స్కోర్ స్కోర్ను పరుగులు పెట్టించాడు. కివీస్ కెప్టెన్ 48 బంతుల్లో 85 పరుగులు చేశాడు. కేన్ తన ఇన్నింగ్స్లో 10 ఫోర్లు, 3 సిక్సులు బాదాడు. ఆసీస్ బౌలర్లలో జోష్ హాజిల్వుడ్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఆడమ్ జంపా ఒక వికెట్ ఖాతాలో వేసుకున్నాడు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కివీస్కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ డారిల్ మిచెల్ (8 బంతుల్లో 11: ఒక సిక్స్) దూకుడుగా ఆడేందుకు యత్నించినా త్వరగానే ఔటయ్యాడు. తర్వాత క్రీజ్లోకి వచ్చిన కెప్టెన్ కేన్విలియమ్సన్తో కలిసి మార్టిన్ గప్తిల్ (28) ఇన్నింగ్స్ను నిలబెట్టాడు. వీరిద్దరూ కలిసి 48 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. అయితే ఆడమ్ జంపా బౌలింగ్లో భారీ షాట్కు యత్నించిన గప్తిల్ ఆసీస్ ఫీల్డర్ మార్కస్ స్టాయినిస్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో పెవిలియన్కు చేరాడు. తర్వాత బ్యాటింగ్కు దిగిన గ్లెన్ ఫిలిప్స్ (18: ఒక ఫోర్, ఒక సిక్స్)తో కలిసి కేన్ విజృంభించాడు. ఆరంభంలో నిదానంగా ఆడిన కేన్.. తర్వాత దూకుడు పెంచాడు. ఈ క్రమంలో కెరీర్లో 14వ అర్ధ శతకం నమోదు చేశాడు.
ఒక పక్క ధాటిగా ఆడుతుండటం.. మరోవైపు బంతులు ఉండటంతో టీ20ల్లో కేన్ విలియమ్సన్ తొలి సెంచరీ సాధిస్తాడని అభిమానులు ఆశించినప్పటికీ.. అది సాధ్యపడలేదు. 85 పరుగుల వద్ద జొష్ హేజిల్వుడ్ బౌలింగ్లో బౌండరీ లైన్ వద్ద స్టీవ్ స్మిత్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. చివర్లలో టీమ్ సీఫర్ట్ (8 నాటౌట్), జేమ్స్ నీషమ్ (13 నాటౌట్) బ్యాటింగ్తో కివీస్ స్కోరు 170 పరుగులు దాటింది. ఆసీస్ బౌలర్లలో హేజిల్వుడ్ 3, జంపా ఒక వికెట్ తీశారు. ఫైనల్ గెలవాలంటే కివీస్ పోరాడాల్సిందే. అయితే ఇరు జట్లలో ఎవరు గెలిచినా. మొదటిదారి టైటిల్ కైవసం చేసుకోనున్నారు.