విలియమ్సన్ ఔట్
మొదటి రెండు వన్డేలకు విలియమ్సన్ బదులుగా కివీస్ జట్టు కెప్టెన్గా టామ్ లాథమ్ వ్యవహరిస్తాడని న్యూజిలాండ్ బోర్డు స్పష్టం చేసింది. ఇక విలియమ్సన్ స్థానంలో మార్క్ చాప్మెన్ భర్తీ చేయనున్నాడు. టీమిండియాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో విలియమ్సన్ గాయపడ్డాడు. ఆపై జరిగిన రెండు టీ20లకు అతడు దూరమయ్యాడు. దీంతో మంచి ఫామ్లో ఉన్న కెప్టెన్ దూరమవడంతో కివీస్ మిగతా రెండు మ్యాచులు కూడా ఓడిపోయింది.
విలియమ్సన్కు విశ్రాంతి:
తాజాగా విలియమ్సన్ ఎక్స్-రే రిపోర్ట్ను పరిశీలించిన కివీస్ జట్టు వైద్యులు కంగారు పడాల్సింది ఏమీ లేదని తేల్చారు. అయితే గాయం నుంచి విలియమ్సన్ త్వరగా కోలుకోవాలంటే కొద్దిరోజులు క్రికెట్ ఆడకుండా విశ్రాంతి తీసుకుంటే మంచిదని సూచించారు. ఈక్రమంలోనే తొలి రెండు వన్డేలకు కెప్టెన్ దూరంగా ఉన్నాడు.
రోహిత్ శర్మకు గాయం
టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ కూడా గాయం కారణంగా కివీస్తో జరగనున్న వన్డే, టెస్టు సిరీస్లకు దూరం అయిన విషయం తెలిసిందే. ఐదవ టీ20లో శ్రేయాస్ అయ్యర్ షాట్ కొట్టగా.. సింగల్ తీసే క్రమంలో రోహిత్ పిక్క కండరాలు పట్టేశాయి. మొదటగా ఫిజియో వచ్చి ప్రాథమిక చికిత్స చేశాడు. అనంతరం ఓ భారీ సిక్స్ బాదినా.. ఆ తర్వాత బంతికి రోహిత్ బాగా ఇబ్బంది పడ్డాడు. దీంతో మైదానం వీడాడు. ఫీల్డింగ్ సమయంలో కూడా మైదానంలోకి దిగలేదు.
జట్టు ఫలితంపై ప్రభావం
ఐదు టీ20ల సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన జోష్లో ఉన్న భారత జట్టు వన్డే సిరీస్ను కూడా కైవసం చేసుకోవాలనే ఆలోచనలో ఉంది. మరోవైపు వన్డే సిరీస్ అయినా గెలుచుకోవాలని కివీస్ చూస్తోంది. ఈ నేపథ్యంలో సూపర్ ఫామ్లో ఉన్న హిట్మ్యాన్ రోహిత్ శర్మ దూరం కావడం భారత జట్టు ఫలితంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మరోవైపు కివీస్ పరిస్థితి ఇలానే ఉంది.