కోహ్లీ పెవిలియన్:
అలాగే స్టేడియంలోని ఒక స్టాండ్కు విరాట్ కోహ్లీ పెవిలియన్ అని పేరు పెట్టారు. ఈ రెండు కార్యక్రమాలు గురువారం నెహ్రూ స్టేడియంలోని వెయిట్లిఫ్టింగ్ హాల్లో జరిగాయి. దీనికి భారత హోంశాఖ మంత్రి అమిత్ షా, క్రికెట్ దిగ్గజం కపిల్దేవ్ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. విరాట్ కోహ్లీ, ఆయన సతీమణి అనుష్క శర్మ, కోచ్ రవి శాస్త్రి సహా పలువురు ఆటగాళ్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విరాట్ కోహ్లీ క్రికెట్ ప్రయాణానికి సంబంధించిన ఓ వీడియోను ప్రదర్శించారు.
ఆటను వేరే స్థాయికి తీసుకెళ్లిపోయాడు:
కపిల్దేవ్ మాట్లాడుతూ... 'కోహ్లీకి ఇంకా చాలా కెరీర్ ఉంది. అతని కెరీర్ మధ్యలో ఉండగా ఎన్ని రికార్డులు బద్ధలు కొడతాడనే దానిపై మాట్లాడటం సరైనది కాదు. సచిన్ తన శకంలో రికార్డులు మోత మోగించాడు. అదొక అద్భుతం. సచిన్ రికార్డులకు చేరువగా ఎవరూ వస్తారని అనుకోలేదు. ఇప్పుడు సచిన్ అత్యధిక సెంచరీల రికార్డుకు విరాట్ చేరువగా వచ్చాడు. అయితే ఆటను కోహ్లీ వేరే స్థాయికి తీసుకెళ్లిపోయాడు' అని అన్నారు.
అపారమైన జ్ఞానం కోహ్లీ సొంతం:
'కోహ్లీ పరుగుల వరద సృష్టించడం టీమిండియాకు శుభపరిణామం. కోహ్లీ ఆటను చూసి నేను చాలా సంతోష పడుతున్నా. క్రికెట్లో అపారమైన జ్ఞానం అతని సొంతం. అలాంటి ఆటగాడిని టీమిండియాకు ఇచ్చినందుకు ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్కు థ్యాంక్స్ చెప్పాలి. కోహ్లీ ఇలాగే పరుగులు చేయాలని, టీమిండియాకు మరింత పేరును తేవాలని కోరుకుంటున్నా' అని కపిల్దేవ్ పేర్కొన్నాడు.
ఏం చేసినా తక్కువే:
'ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్కు జైట్లీ అధ్యక్షుడిగా ఎంతో సేవ చేశారు. మనం ఏం చేసినా.. అతనికి సరిపోదు అని నేను అనుకుంటున్నా. క్రికెట్ కోసం చాలా చేసారు. వ్యక్తిగతంగా నేను దాని గురించి చాలా సంతోషంగా ఉన్నా. జైట్లీకి క్రికెట్ ఆటపై ఎంతో జ్ఞానం ఉంది' అని కపిల్దేవ్ చెప్పుకొచ్చారు.