
హైదరాబాద్: దక్షిణాఫ్రికా పర్యటనకు అతి తక్కువ సమయంలో సన్నద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దీనికంతటికీ కారణం బీసీసీయేనని కోహ్లీ చేసిన వ్యాఖ్యలను బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా సమర్ధించారు. అంతేకాదు దీనిపై సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా ఆయన స్పష్టం చేశారు.
ఆటగాళ్లకు విశ్రాంతి లేకుండా తక్కువ సమయంలో మూడు వరుస సిరీస్లను షెడ్యూల్ చేయడంపై బోర్డు సభ్యులు మరోసారి ఆలోచించాలని ఖన్నా ఈ సందర్భంగా పేర్కొన్నాడు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో ఆయన మాట్లాడుతూ 'విరాట్ కోహ్లీ ఇండియన్ టీమ్ కెప్టెన్. అతని అభిప్రాయాలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి. టీమ్ రాణిస్తున్నా.. ప్లేయర్స్ అలసిపోతున్నారంటే ఇది సీరియస్గా చర్చించాల్సిన విషయం' అని ఖన్నా అన్నాడు.
అంతేకాదు డిసెంబర్ 9న జరిగే బీసీసీఐ స్పెషల్ జనరల్ మీటింగ్లో ఈ సమస్యను చేరిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ముగిసిన తర్వాత నుంచి భారత ఆటగాళ్లు వరుస సిరీస్లలో పాల్గొన్నారు.
ఐపీఎల్ తర్వాత ఛాంపియన్ ట్రోఫీ, వెస్టిండీస్, శ్రీలంక పర్యటనలలో కోహ్లీసేన ఆడింది. ఆ తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంకలతో సిరీస్లు.. ఆ వెంటనే కీలకమైన దక్షిణాఫ్రికా పర్యటనకు కోహ్లీసేన వెళ్లనుంది. ఇలా టీమిండియా స్వదేశంలో వరుస సిరిస్లతో ఆటగాళ్లపై పనిభారాన్ని విపరీతంగా పెంచుతోంది.
ఈ నేపథ్యంలో నాగ్పూర్ వేదకగా భారత్-శ్రీలంక జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ శుక్రవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. నిజానికి 2023 వరకు ప్రతి ఏడాది నవంబర్-డిసెంబర్ స్లాట్ను పాకిస్థాన్తో సిరిస్ కోసం కేటాయించారు.
ఆయితే పాకిస్థాన్తో మ్యాచ్లకు కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి కావడంతో వాటి స్థానంలో వేరే సిరీస్లను బోర్డు ఏర్పాటు చేసింది. ప్రస్తుతం న్యూజిలాండ్, శ్రీలంక సిరీస్లు అందులో భాగమేనని బీసీసీఐకి చెందిన ఓ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
శ్రీలంక బోర్డు మొదటి నుంచీ ఇండియాకు మద్దతుగా ఉండటంతో ఆ జట్టుతో తరచూ బీసీసీఐ సిరీస్లు ఏర్పాటు చేస్తోంది. దీంతో కష్టాల్లో ఉన్న శ్రీలంక బోర్డుకు కూడా కాస్త ఆదాయాన్ని వెనుకేసుకుంటోంది. జనవరిలో దక్షిణాఫ్రికా సిరీస్ ముగిసిన తర్వాత వచ్చే ఏడాది మార్చిలో శ్రీలంక-బంగ్లాదేశ్-భారత్ ముక్కోణపు సిరిస్ ఆడనుంది.