ఇస్లామాబాద్: ప్రస్తుత క్రికెట్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అత్యుత్తమ బ్యాట్స్మెన్. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఫార్మాట్ ఏదైనా, బౌలర్ ఎవరైనా పరుగుల వరద పారించడం మనోడి స్టైల్. విరాట్కి బౌలింగ్ వేయాలంటే.. చాలా మంది బౌలర్లు కాస్త జంకుతారు. అయితే 17 సంవత్సరాల పాకిస్థానీ యువ బౌలర్ నీశమ్ షా మాత్రం కోహ్లీకి బౌలింగ్ చేయడంలో తను భయపడడం లేదని అన్నాడు. కోహ్లీ అంటే గౌరవం అని అంటున్నాడు.
'అక్తర్ని స్లెడ్జ్ చేస్తానంటే.. ధోనీ సరే అన్నాడు'
తాజాగా పాక్ప్యాషన్.నెట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నీశమ్ షా మాట్లాడుతూ... కోహ్లీకి బౌలింగ్ చేయడం కోసం ఎదురుచూస్తున్నానని, కోహ్లీ అంటే గౌరవమే కానీ భయం లేదన్నాడు. 'భారత్-పాక్ మ్యాచ్ అంటే ఎప్పటికీ ప్రత్యేకమే. అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తారు. నేనింతకుముందే ఒక విషయం చెప్పాను.. భారత్-పాక్ లాంటి మ్యాచ్ల్లో ఆటగాళ్లు హీరోలవ్వచ్చు. అదే సమయంలో విలన్లు కూడా అవ్వొచ్చు. అలాంటి మ్యాచ్లు ఎప్పుడో ఒకసారి జరుగుతాయి కాబట్టి అవి చాలా ప్రత్యేకం' అని నీశమ్ షా పేర్కొన్నాడు.
'టీమిండియాతో ఎప్పుడు అవకాశం వచ్చినా ఆడేందుకు సిద్ధంగా ఉన్నా. భారత్తో తలపడే అవకాశం వస్తే పాక్ అభిమానులను ఏమాత్రం నిరుత్సాహపర్చను. ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయిస్తా. విరాట్ కోహ్లీని గౌరవిస్తా కానీ భయపడను. అత్యుత్తమ ఆటగాళ్లకు బౌలింగ్ చేయడం ఎప్పుడూ సవాలుగానే ఉంటుంది, అక్కడే తమ ఆటని మెరుగుపర్చుకోవాలి. భారత్, కోహ్లీతో ఆడే అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నా' అని యువ బౌలర్ చెప్పాడు.
ఈ ఏడాది ఫిబ్రవరి 10న రావల్పిండిలో బంగ్లాదేశ్తో ఆడిన టెస్టులో నీశమ్ షా హ్యాట్రిక్ వికెట్లు సాధించి చరిత్ర సృష్టించాడు. టెస్టు క్రికెట్లో ఈ ఘనత అందుకున్న అతిపిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. నసీమ్ 16 ఏళ్ల 359 రోజుల వయసులోహ్యాట్రిక్ వికెట్లు సాధించాడు. దీంతో పాక్ తరఫున హ్యాట్రిక్ సాధించిన నాలుగో బౌలర్గా నిలిచాడు. గతంలో మహ్మద్ షమీ, అబ్దుల్ రజాక్, వసీం అక్రమ్ మాత్రమే ఈ రికార్డు నెలకొల్పారు. అలాగే గతేడాది శ్రీలంకతో జరిగిన కరాచీ టెస్టు మ్యాచ్లోనూ అతడు ఐదు వికెట్లు దక్కించుకొన్నాడు.