లక్ష్మణ్ దేశవాళీల్లో ఆడి వచ్చాడు
శవాళీ ఫామ్ కారణంగా సురేశ్ రైనా తిరిగి జాతీయ జట్టుకు ఎంపిక కాలేకపోయాడని ఎమ్మెస్కే ప్రసాద్ పేర్కొన్నాడు. తనను జాతీయ జట్టుకు ఎందుకు ఎంపిక చేయలేదనే అంశంపై కనీస సమాచారం ఇవ్వకపోవడంపై ఇటీవల రైనా ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో మాజీ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించాడు. '1999లో వీవీఎస్ లక్ష్మణ్ టెస్టు జట్టులో చోటు కోల్పోయిన సమయంలో దేశవాళీల్లో ఆడి పరుగుల వరద పారించాడు. ఏకంగా 1400 పరుగులు చేశాడు. సీనియర్ ఆటగాళ్ల నుంచి మేం ఇదే ఆశిస్తాం. సీనియర్ ఆటగాళ్లకు సంబంధించినంతవరకు సెలెక్టర్లు బాద్యతగానే ఉంటారు' అని ఎమ్మెస్కే తెలిపాడు.
దేశవాళీల్లో ఏమంత గొప్ప ప్రదర్శన చేయలేదు
'జాతీయ జట్టుకు దూరమైన తర్వాత సురేష్ రైనా దేశవాళీల్లో ఏమంత గొప్ప ప్రదర్శన చేయలేదు. 2018-19 రంజీ సీజన్లో అతడి ఆట పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అలాగే ఐపీఎల్లోనూ అతడి బ్యాట్ నుంచి మునుపటి మెరుపులు కనిపించలేదు. ఇతర యువకులు దేశీయ క్రికెట్, ఇండియా-ఎలో అద్భుత ప్రదర్శనలు చేసారు. భారత జట్టులో చోటు దక్కించుకున్నారు' అని నాలుగేళ్లు పదవిలో ఉన్న ప్రసాద్ చెప్పాడు. 2018-19 సీజన్లో ఐదు రంజీ మ్యాచ్లలో రైనా 243 పరుగులు చేసాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. 2019లో చెన్నై తరఫున 17 మ్యాచ్లలో 383 పరుగులు మాత్రమే చేశాడు.
సీనియర్ ఆటగాళ్ల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి
తాజాగా ఆజ్తక్ చానెల్కు ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో రైనా మాట్లాడుతూ.. ఓ సీనియర్ ప్లేయర్ను జట్టు నుంచి తొలిగిస్తే దానికి కారణం చెప్పాలన్నాడు. 'సీనియర్ ఆటగాళ్ల పట్ల సెలెక్టర్లు మరింత బాధ్యతగా వ్యవహరించాలి. ఈ రోజు అవకాశం వచ్చింది.. బాగా ఆడావు.. ఇంటికెళ్లావు. కానీ తర్వాతి మ్యాచ్లో ఆడే అవకాశం రాకపోతే.. ఎందుకు అనే కారణం అతడికి తెలియాలి. ఏదైనా లోపాలుంటే ఎత్తి చూపండి. వాటిని సరిదిద్దుకుంటాం. ఏమీ చెప్పకపోతే ఎలా అర్ధం చేసుకోవాలి. ఏలా మెరుగవ్వాలి' అని రైనా ప్రశ్నించాడు.
రైనా ఆశలకు కరోనా గండి
మోకాలి గాయానికి గత ఏడాది ఆగస్టులో నెదర్లాండ్స్లోని అమస్టర్డామ్లో రైనా రెండోసారి సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి క్రికెట్కి దూరంగా ఉంటున్నాడు. ఇటీవలే ఫిట్నెస్ సాధించేందుకు తీవ్రంగా శ్రమించాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ట్రైనర్ గ్రేమ్ కింగ్ పర్యవేక్షణలో ఫిట్నెస్ సాధించాడు. ఐపీఎల్ 2020 సీజన్లో మంచి ప్రదర్శన చేసి ఈ ఏడాది అక్టోబరులో జరిగే టీ20 ప్రపంచకప్కి టీమిండియాలో చోటు దక్కించుకోవాలని రైనా ఆశించాడు. అయితే ఐపీఎల్-13ను రద్దు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో రైనా ఆశలకు కరోనా గండి కొట్టేలా ఉంది.
గతేడాది జూలైలో చివరి వన్డే:
భారత్ తరఫున రైనా 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. 2006లో అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేసిన సురేశ్ రైనా.. 78 మ్యాచ్లాడి 134.79 స్ట్రైక్రేట్తో 1604 పరుగులు చేశాడు. గత ఏడాది జూలైలో చివరిగా వన్డే ఆడిన రైనా.. ఆ తర్వాత పేలవ ఫామ్ కారణంగా జట్టులో చోటు కోల్పోయాడు. ప్రస్తుతం రీఎంట్రీ కోసం రైనా ఎదురుచూస్తున్నాడు. టీ20 ప్రపంచకప్ జరగనుండగా.. ఆ టోర్నీలో ఆడి రిటైర్మెంట్ ప్రకటించాలని 33 ఏళ్ల రైనా ఆశిస్తున్నాడు.