కుర్రాళ్లకు జట్టు
గురువారం ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమీటి బంగ్లాదేశ్తో జరగనున్న టీ20, టెస్టు సిరీస్లకు భారత జట్టును ప్రకటించింది. టీ20 సిరీస్కు రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతినివ్వగా.. వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. దేశవాళీ క్రికెట్లో సత్తాచాటిన ఆటగాళ్లకు సెలక్షన్ కమిటీ అధిక ప్రాధాన్యం ఇచ్చింది. శివమ్ దూబే, సంజు శాంసన్ లాంటి కుర్రాళ్లకు జట్టులో చోటు దక్కింది. 15 మంది టీ20 జట్టులో ధోనీ మాత్రం లేడు. సెలక్షన్ అనంతరం ఎమ్మెస్కే మాట్లాడారు.
జట్టు భవిష్యత్తు గురించే ఆలోచిస్తున్నాం
'ప్రపంచకప్ ముగిసిన తర్వాత జట్టు భవిష్యత్తు గురించే ఆలోచిస్తున్నాం. ధోని వారసుడిగా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్పై ప్రస్తుతం మేం ఎక్కువ దృష్టి పెట్టాం. కుర్రాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఇందులో భాగంగానే పంత్తో పాటు శాంసన్ను కూడా ఎంపిక చేశాం. మా ప్రక్రియ మీకు అర్థమవుతోందని భావిస్తున్నా' అని ఎమ్మెస్కే ప్రసాద్ అన్నారు.
ధోనీతో మాట్లాడాం
'బంగ్లాదేశ్తో సిరీస్కు జట్టు ఎంపికకు ముందే ధోనీతో మాట్లాడాం. కుర్రాళ్లను ప్రోత్సహించాలనే మా ఆలోచనను సమర్దించాడు. అతని భవిష్యత్తు గురించి కూడా మేం మాట్లాడాం. మళ్లీ జట్టులోకి రావాలంటే ధోనీ ఇష్టం. దేశవాళీ క్రికెట్ ఆడి టచ్లోకి వస్తాడా లేదా రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తాడా అనేది పూర్తిగా వ్యక్తిగతం. జట్టు భవిష్యత్తు కోసం ప్రణాళిక రూపొందించాం. దాని ప్రకారమే ఆటగాళ్లను ఎంపిక చేస్తున్నాం' అని ఎమ్మెస్కే స్పష్టం చేసాడు.
పంత్పైనే మా దృష్టి
'పంత్ను ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నాం. విఫలమయినా.. ఇప్పుడు అతడికి మద్దతుగానే ఉన్నాం. పంత్ మెరుగవుతున్నాడు. అతడి స్థాయి, అంచనాలకు తగ్గట్టు కొన్ని మ్యాచ్లు ఆడకున్నా.. మద్దతివ్వడం ద్వారానే మనం ఓ అత్యున్నత ఆటగాడిని జట్టుకు అందించగలం. పంత్ విజయవంతమవుతాడనే నమ్మకం ఉంది. టీ20 ప్రపంచకప్ కోసం మా దృష్టంతా అతడిపైనే ఉంటుంది' అని ఎమ్మెస్కే చెప్పాడు.
ధోనీ భవిష్యత్తు ఏంటి?
టీ20 ప్రపంచకప్ వరకు ధోనీ ఆడుతాడని సమాచారం వచ్చినా.. టీ20 ప్రపంచకప్ కోసం మా దృష్టంతా పంత్పై ఉందని సెలెక్టర్లు చెబుతుబడడంతో ధోనీ భవిష్యత్తు ఏంటి? అని అందరూ అనుకుంటున్నారు. ధోనీ ఆటకు గుడ్బై చెప్పినట్లేనని సెలెక్టర్ల మాటల సారాంశంగా కనిపిస్తోంది. మరోవైపు ధోనీ జార్ఖండ్ అండర్-23 టీమ్తో కలిసి ప్రాక్టీస్ చేయనున్నట్లు సమాచారం తెలుస్తోంది. దాదా, ధోనీలలో ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తే తప్ప ఈ విషయంపై స్పష్టత రాదు.