రెండు మూడు మ్యాచుల్లో విజయాలు
ఏడాది కాలంగా టీమిండియా తరఫున దినేశ్ కార్తీక్ నిలకడగానే రాణించాడు. రెండు మూడు మ్యాచుల్లో విజయాలు అందించాడు. కీలక సమయాల్లో పరుగులు చేస్తున్నాడు. అతడితో వచ్చిన చిక్కల్లా ఏమిటంటే 20, 30 పరుగులను హాఫ్ సెంచరీలు, సెంచరీలుగా మలవలేకపోవడం అని తెలిసింది. దీనిని దృష్టిలో పెట్టుకునే దినేశ్ కార్తీక్ స్థానంలో సెలక్టర్లు రిషబ్ పంత్కి చోటు కల్పించారంటూ వార్తలు వస్తున్నాయి.
ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ
ఈ నేపథ్యంలో ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ "భారత జట్టులో నెంబర్ వన్ వికెట్ కీపర్ ఎవరు? అనేదానిపై మాకు సందేహాల్లేవు. అయితే ఇప్పుడు మా అన్వేషణంతా రెండో (ప్రత్యామ్నాయ) వికెట్ కీపర్ కోసం. ఇప్పటికే ఆ దిశగా దినేశ్ కార్తీక్కి అవకాశాలిచ్చాం. తాజాగా రిషబ్ పంత్కి ఇస్తున్నాం. సరైన సమయంలో ఇద్దరిలో ఎవరు బెస్ట్? అనేది నిర్ణయిస్తాం. అంతేతప్ప వికెట్ కీపర్గా దినేశ్ కార్తీక్ దారులు మూసుకుపోయినట్లు కాదు" అని ఎమ్మెస్కే స్పష్టం చేశారు.
మొదటి రెండు వన్డేలకు జట్టుని ప్రకటించిన సెలక్టర్లు
వెస్టిండిస్తో భారత్ జట్టు మొత్తం ఐదు వన్డేలు ఆడనుండగా.. తొలి రెండు వన్డేలకి మాత్రమే జట్టుని సెలక్టర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. నిజానికి దినేశ్ కార్తీక్తో పోలిస్తే రిషబ్ పంత్ అలవోకగా భారీ సిక్సర్లు బాదగలడు. దీంతో పంత్ను తీసుకుంటే మ్యాచ్లు ముగించగలడు. పంత్ గనుక వన్డేల్లో క్లిక్ అయితే, ధోని తర్వాత టీమిండియా మరో ఫినిషర్ దొరికినట్లేనని జట్టు యాజమాన్యం భావిస్తోంది. వచ్చే ఏడాది దృష్ట్యా మిడిలార్డర్లో పంత్ కుదురుకుంటే జట్టు కూర్పులో ఇబ్బందులు ఉండవు.
మొదటి రెండు వన్డేలకు వన్డే జట్టు
జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, అంబటి రాయుడు, మనీశ్ పాండే, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్), రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, చాహల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, ఖలీల్ అహ్మద్, శార్ధూల్ ఠాకూర్, కేఎల్ రాహుల్