కెప్టెన్గా ధోనీనే:
తాజాగా ఎన్ శ్రీనివాసన్ మాట్లాడుతూ... 'ధోనీ అంతర్జాతీయ భవిష్యత్తు గురించి నాకు తెలియదు. కానీ నేను ఒక్క విషయం మాత్రం చెప్పగలను. వచ్చే ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్కు ఎంఎస్ ధోనీ మాత్రమే కెప్టెన్గా ఉంటాడు' అని శ్రీనివాసన్ అన్నారు. దీంతో ధోనీ వచ్చే ఐపీఎల్ సీజన్లో ఆడడం ఖాయం అయింది. బహుశా వచ్చే ఐపీఎల్ ధోనీకి చివరిది కావొచ్చు. ధోనీ ఆధ్వర్యంలో చెన్నై 10 సీజన్లు ఆడగా.. మూడుసార్లు ట్రోఫీని గెలుచుకుంది. ఈ సంవత్సరం ముంబై ఇండియన్స్ చేతిలో చెన్నై కేవలం ఒక పరుగు తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే.
అమెరికాలో ఎంజాయ్:
ఇప్పటికే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ.. పరిమిత ఓవర్ల క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు. అయితే గత కొద్దికాలంగా పేలవ ఫామ్తో సతమతమవుతున్న ధోనిపై విమర్షల వర్షం కురుస్తోంది. ఇంగ్లాండ్ వేదికగా వన్డే ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత ఆర్మీకి సేవలందించాలనే ఉద్దేశంతో రెండు నెలల పాటు క్రికెట్ నుంచి విశ్రాంతి తీసుకున్నాడు. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో అమెరికాలో ఎంజాయ్ చేస్తున్నాడు.
కోహ్లీ ట్వీట్:
సందర్భమేమీ లేకపోయినా.. 2016 టీ20 ప్రపంచకప్లో ధోనీతో కలిసి ఆడిన మ్యాచ్ గుర్తు చేసుకుంటూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గురువారం ఓ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాడనే ఊహాగానాలకు తెరలేపింది. ఇప్పటికే జట్టు మేనేజ్మెంట్కు తన నిర్ణయాన్ని చెప్పేశాడని.. గురువారం తన నిర్ణయాన్ని మీడియా సమావేశంలో వెల్లడించనున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. అయితే ఈ వార్తలపై ధోనీ సతీమణి సాక్షి స్పందించారు. రిటైర్మెంట్పై వస్తున్న వార్తలు రూమర్స్ అంటూ కొట్టిపారేశారు.
రిటైర్మెంట్ వార్తల్లో నిజం లేదు:
ధోనీ రిటైర్మెంట్ వార్తలపై దక్షిణాఫ్రికాతో టెస్టు సిరిస్కు జట్టుని ప్రకటించే సమయంలో ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ సైతం స్పందించాడు. ధోనీ రిటైర్మెంట్ అంశానికి సంబంధించి తమకు ఎటువంటి సమాచారం అందలేదని తెలిపిన ఎమ్మెస్కే .. ధోనీ రిటైర్మెంట్పై వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశాడు. ధోనీ రిటైర్మెంట్, ప్రెస్ మీట్పై తమకు అధికారిక సమాచారం లేదని బీసీసీఐ సైతం పేర్కొంది. ధోనీ స్వయంగా వెస్టిండీస్, దక్షిణాఫ్రికా పర్యటనల నుండి తప్పుకున్న విషయం తెలిసిందే.