న్యూఢిల్లీ: వచ్చే ప్రపంచకప్ వరకూ టీమిండియా కెప్టెన్గా మహేంద్ర సింగ్ ధోనీనే కొనసాగించాలని ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ప్రస్తుతం సమస్యగా మారిన ఐదు, ఆరు, ఏడు స్థానాల బ్యాటింగ్ ఆర్డర్ కుదురుకోవాలంటే ధోనీని కెప్టెన్గా కొనసాగిస్తేనే సాధ్యపడుతుందని సెహ్వాగ్ పేర్కొన్నాడు.
దీంతో వరల్డ్ కప్ నాటికి ఒక మెరుగైన జట్టు తయారవుతుందన్నాడు. అలా కాకుండా ధోని రిటైర్మెంట్ను ఊహించుకుంటే మాత్రం జట్టు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందన్నాడు. 'వచ్చే వరల్డ్ కప్ వరకూ ధోని కొనసాగితే క్రికెట్ చూసే అభిమానులకు ఐదు, ఆరు, ఏడు స్థానాల్లో బ్యాటింగ్ ఆర్డర్పై ఆసక్తి ఉంటుంది' అని తెలిపాడు.
'ఒక వేళ అలా జరుగకపోతే మాత్రం ఆయా స్థానాలు చాలా బలహీనంగా మారి మన జట్టులో సరైన ఫినిషింగ్ లేదు అనే ఆలోచనకు వస్తారు. అందుచేత వరల్డ్ కప్ వరకూ ధోనీని పరిమిత ఓవర్ల కెప్టెన్గా కొనసాగిస్తే టీమిండియా బలోపేతం అయ్యే అవకాశం ఉంటుంది' అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.
కాగా, తను టీమిండియాకు దూరం కావడానికి మహేంద్ర సింగ్ ధోనీనే కారణమన్న ఊహాగానాలను సెహ్వాగ్ కొట్టిపారేశాడు. తాను అలా అనుకోవడం లేదని, అందులో ఎలాంటి వాస్తవం లేదని చెప్పాడు.
ధోనీ చాలా మంచి వ్యక్తని, అతని నాయకత్వంలో చాలా మంది సీనియర్లు ఆడారని తెలిపాడు. ధోనీ కూడా సీనియర్ల సూచనలతోనే వన్డే, టెస్ట్, టీట్వంటీల్లో కెప్టెన్గా ఎదిగాడని చెప్పాడు. ధోనీతో తనకు ఎలాంటి విభేదాలు లేవని తెలిపాడు. అలాంటివి ఉంటే తాను ఇంకా తొందరగా వీడ్కోలు పలికేవాడినని చెప్పాడు.
తాను టీమిండియా కెప్టెన్ కావాలని అనుకోలేదని, అవకాశం వచ్చినా కూడా టీంలోని ఇతర ఆటగాళ్లకు ఇవ్వమని సూచించినట్లు తెలిపాడు. ధోనీ భారత ఉత్తమ కెప్టెన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే గెలుపు క్రెడిట్ కెప్టెన్కు మాత్రమే కాకుండా ఆటగాళ్లందరికీ రావాలి' అని తెలిపాడు.
'కెప్టెన్ ఒక్కడి వల్లే జట్టు విజయం సాధించదు. టీంలోని అందరూ ఆటగాళ్లు సమష్టిగా రాణిస్తేనే విజయం సాధ్యపడుతుంది. అందువల్ల క్రెడిట్ మొత్తం కెప్టెన్కు ఇవ్వకుండా, మొత్తం జట్టుకు ఇవ్వాల్సి ఉంటుంది' అని సెహ్వాగ్ స్పష్టం చేశాడు.