హైదరాబాద్: 'అది ఇక్కడ పడాలి. ఇతను ఇలా అవుట్ అవుతాడు' అని ధోనీ ముందుగానే పసిగట్టి స్పిన్నర్లకు చెప్తేనే వాళ్లు బౌలింగ్ చేయగలుగుతున్నారని కొనియాడాడు భారత మాజీ క్రికెటర్ అతుల్ వాస్సన్. ధోనీ వన్డేల్లో పరుగులు చేయట్లేదని విమర్శించే వాళ్లు ముందు జట్టులో ధోనీ ఏమేం చేస్తున్నాడో తెలుసుకోవాలని పేర్కొన్నాడు. స్పిన్నర్లు సగం పైగా వికెట్లు ధోనీ చొరవతోనే తీయగలుగుతున్నారంటూ గుర్తు చేశారు.
తాజాగా జరుగుతున్న ఆరు వన్డేల సిరీస్లో ఇప్పటికే ఐదు వన్డేలు ముగియగా.. ఈ మణికట్టు స్పిన్నర్లే ఏకంగా 30 వికెట్లు పడగొట్టి భారత జట్టు విజయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. మంగళవారం రాత్రి ముగిసిన ఐదో వన్డేలో గెలిచిన భారత జట్టు సిరీస్ని 4-1తో దక్కించుకుంది. కాగా, చివరి వన్డే శుక్రవారం జరగనుంది.
ఈ నేపథ్యంలో గురువారం మీడియాతో మాట్లాడిన వాసన్.. పేస్ బౌలర్లకి అనుకూలించే సఫారీ పిచ్లపై మణికట్టు స్పిన్నర్లు రాణిస్తుండటాన్ని ప్రశంసించాడు. దక్షిణాఫ్రికా పిచ్లపై మణికట్టు స్పిన్నర్లు చాహల్, కుల్దీప్ యాదవ్ తీసిన వికెట్లలో సగం ఘనత మహేంద్రసింగ్ ధోనీకి కూడా దక్కాలని తెలిపాడు.
వికెట్ల వెనుక ధోనీ అద్భుతంగా పనిచేస్తూ వారికి సూచనలిస్తూ వచ్చిన సంగతి రికార్డింగ్లు కూడా అందరూ విన్నారని పేర్కొన్నాడు. ఈ విషయం స్టంప్ మైక్లో కూడా స్పష్టంగా రికార్డైందని అన్నాడు.
'సఫారీ బ్యాట్స్మెన్ ఏ షాట్ కోసం ప్రయత్నించబోతున్నాడో.. ముందుగానే ఊహిస్తూ వచ్చిన ధోనీ.. దానికి అనుగుణంగా స్పిన్నర్లకి వేగంగా సూచనలిస్తూ వచ్చాడు. కాబట్టే.. చాహల్, కుల్దీప్ బ్యాట్స్మెన్ పాదాల దగ్గర బంతులు వేస్తూ కట్టడి చేయగలిగారు. లేకుంటే.. వారికి అంత అనుభవం ఎక్కడిది..? స్పిన్నర్ల కోసం ధోనీ.. వికెట్ల వెనుక చాలా కష్టపడుతూ బ్యాట్స్మెన్ కదలికల్ని గమనిస్తున్నాడు. అందుకే.. స్పిన్నర్ల వికెట్ల ఘనతలో సగం ధోనీకి కూడా దక్కాలి' అని వాసన్ వెల్లడించాడు.