భారీ శబ్దాల మధ్య టాస్కు వెళ్లాం:
లైవ్ సందర్భంగా కుమార సంగక్కర ఫైనల్ మ్యాచ్లో రెండు సార్లు టాస్ వేసిన విషయాన్ని తెలుపుతూ, దానికి గల కారణాలు వెల్లడించాడు. 'అంతమంది ప్రేక్షకులను శ్రీలంక మైదానంలో ఎప్పుడూ చూడలేదు. ఆ స్థాయిలో అభిమానులు మైదానానికి రావాలన్నా, ఆటగాళ్లను ఉత్సాహపరచాలన్నా అది కేవలం భారత్లోనే సాధ్యం. కిక్కిరిసిన ప్రేక్షకులు, భారీ శబ్దాల మధ్య టాస్కు వెళ్లాం. ధోనీ టాస్ వేయగా.. నేను టెయిల్స్ అన్నాను. అతనికి వినపడలేదు. దాంతో 'నువ్వు టెయిల్స్ అన్నావా' అని ధోనీ నన్నడిగాడు. అందుకు నేను జవాబిస్తూ.. 'కాదు టెయిల్స్ అన్నానని' చెప్పాను. దీనిబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్లో సౌండ్స్ ఉన్నాయో' అని సంగా తెలిపాడు.
రెండోసారి టాస్ వేద్దామన్నాడు:
'మా ఇద్దరి సంభాషణ అనంతరం మ్యాచ్ రిఫరీ కలగచేసుకొని నేను టాస్ గెలిచానని చెప్పినా.. ధోనీ ఒప్పుకోలేదు. మళ్లీ వేద్దామన్నాడు. అలా రెండోసారి టాస్ పడింది. రెండోసారి టాస్ వేయగా మళ్లీ నేనే గెలిచి.. బ్యాటింగ్ తీసుకున్నా. బహుశా రెండో సారి మేము టాస్ ఓడిపోయి ఉంటే.. టీమిండియా తొలుత బ్యాటింగ్ తీసుకునేది కావచ్చు. మేము లక్ష్యాన్ని ఛేదించేవాళ్లం కావచ్చు. ఎందుకంటే.. ఐదు, ఆరు స్థానాల వరకు మా బ్యాటింగ్ దుర్బేద్యంగా ఉంది. అప్పటికీ మేము బ్యాటింగ్లో పలు ప్రయోగాలు చేసి విజయవంతమయ్యాం' అని సంగక్కర పేర్కొన్నాడు.
మాథ్యూస్ గాయం కూడా:
'ఏంజిలో మాథ్యూస్ గాయం కూడా మా ఓటమికి కారణమైంది. అతడు ఆరోజు మ్యాచ్లో ఉండి ఉంటే.. మేము ఛేజింగ్ వైపు మొగ్గు చూపేవాళ్లం. ఎందుకంటే అవసరమైన సమయంలో టెయిలెండర్ల సహాయంతో బ్యాటింగ్ చేసి మ్యాచ్ను గట్టెక్కించేవాడు. ఇక జరిగిందేదో జరిగిపోంది. టీమిండియా అద్భుతంగా ఆడింది. ధోనీ తన స్టైల్లో సిక్సర్ కొట్టి టీమిండియాకు ప్రపంచకప్ను అందించాడు' అని సంగక్కర చెప్పాడు.
భారత్ విజయం:
వాంఖడే వేదికగా జరిగిన 2011 ఫైనల్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. కెప్టెన్ మహేల జయవర్దనె (103 నాటౌట్: 88 బంతుల్లో 13x4) అజేయ సెంచరీ చేసాడు. లక్ష్యఛేదనకు దిగిన టీమిండియా వీరేంద్ర సెహ్వాగ్ (0), సచిన్ టెండూల్కర్ (18) వికెట్లను ఆదిలోనే కోల్పోయింది. విరాట్ కోహ్లీ (35) కాసేపు నిలబడ్డాడు. గౌతమ్ గంభీర్ (97: 122 బంతుల్లో 9x4)తో కలిసి ఎంఎస్ ధోనీ (91 నాటౌట్: 79 బంతుల్లో 8x4, 2x6) నాలుగో వికెట్కి 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. గంభీర్ ఔటైనా.. యువరాజ్ సింగ్తో కలిసి 48.2 ఓవర్లలోనే 277/4తో మ్యాచ్ని ధోనీ ముగించాడు.