మాలీసియస్ వెబ్సైట్లకు రీడైరెక్ట్
అభిమానులు తమ ఫేవరెట్ స్టార్ల సమాచారం ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తున్నప్పుడు నకిలీ లింకులు దర్శనమిస్తున్నాయి. వాటిని ఓపెన్ చేస్తే అవి అశ్లీల, ప్రమాదకర వెబ్సైట్లకు దారితీస్తుంటాయి. ఇంటర్నెట్ వాడకంపై అంతగా అవగాహన లేనివారు ఆ లింక్లపై క్లిక్ చేసి ప్రమాదంలో పడుతున్నారు. ఈ క్రమంలో ధోనీ, సచిన్, సన్నీ లియోన్ల గురించి సెర్చ్ చేసినప్పుడు ఎక్కువగా మాలీసియస్ వెబ్సైట్లకు లింకులు రీడైరెక్ట్ అవుతున్నాయి.
ధోనీ అత్యంత ప్రమాదకర వ్యక్తి
ఈ నేపథ్యంలోనే ధోనీ ఇంటర్నెట్ సెర్చ్లో అత్యంత ప్రమాదకర వ్యక్తిగా మారిపోయాడు. ధోనీ పేరుతో సమాచారం వెతుకుతున్నప్పుడు అత్యంత ఎక్కువగా మాలీసియస్ వెబ్సైట్లకు లింకులు రీడైరెక్ట్ అవుతున్నాయని మెకాఫీ సంస్థ వెల్లడించింది. ఇలాంటి సెలెబ్రిటీల జాబితాను ఓ నివేదిక సిద్ధం చేసింది. సచిన్, సన్నీ లియోన్, రాధికా ఆప్టె, శ్రద్ధా కపూర్, పీవీ సింధు, గౌతమ్ గులాటీ ఇందులో ప్రధానంగా ఉన్నారు.
సన్నీ లియోన్ కన్నా ధోనీనే డేంజర్
ధోనీ, సచిన్ ప్రమాదకర సెలెబ్రిటీల జాబితాలో అగ్రస్థానాల్లో ఉన్నారు. బిగ్బాస్-8 విన్నర్ గౌతమ్ గులాటీ, బాలీవుడ్ బాంబ్ సన్నీ లియోన్ వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు. రాధికా ఆప్టే, శ్రధ్దా కపూర్, పీవీ సింధు, హర్మన్ప్రీత్ కౌర్, క్రిస్టియానో రొనాల్డోలు తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితా చూస్తే సన్నీ లియోన్ కన్నా డేంజర్ పర్సన్ ఎంఎస్ ధోనీనే.
నెటిజన్లకు వల
'నెటిజన్లు ఎక్కువగా క్రీడలు, సినిమాలు, టీవీ షోల గురించి వెతుకుతుంటారు. సెలబ్రెటీల ఫోటోలు, వీడియోల కోసం ఎక్కువగా సెర్చ్ చేస్తారు. ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు నకిలీ లింక్లను క్రియేట్ చేసి వారిని ఆకర్షించేలా చేస్తున్నారు. అవి ఓపెన్ చేస్తే అశ్లీల, ప్రమాదకర వెబ్సైట్లు ఓపెన్ అవుతాయి. ఇలా ఓపెన్ చేయడంతో కొన్ని సార్లు వారి మొబైల్/కంప్యూటర్ వైరస్/హ్యాక్కు గురవుతున్నాయి' అని మెకాఫీ పేర్కొంది.
సురక్షితమైన వెబ్సైట్లనే వాడాలి
'అందరికీ ప్రమాదకర వెబ్సైట్లపై అవగాహన ఎక్కువగా ఉండదు. నెటిజన్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. అధికారిక, సురక్షితమైన వెబ్సైట్ల నుంచే సమాచారం తీసుకోవాలి. డివైజుల్లో భద్రతకు సంబంధించిన సాఫ్ట్వేర్లు ఇన్స్టాల్ చేసుకోవాలని' మెకాఫీ ఇండియా ఎండీ వెంకట్ కృష్ణాపుర్ సూచించారు.