
హైదరాబాద్: భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ టెస్టుల్లో సరిగ్గా నాయకత్వం వహించలేకపోయాడని గంగూలీ అభిప్రాయపడ్డారు. ఆత్మకథను ఓ పుస్తకం రాస్తున్న గంగూలీ ఈ విషయాన్ని తాజాగా బయటపెట్టారు. వన్డే, టీ20ల్లో కెప్టెన్గా భారత్కి తిరుగులేని విజయాలు అందించిన మహేంద్రసింగ్ ధోనీ కెప్టెన్సీ గురించి చెప్పీ చెప్పక విమర్శలు సంధించారు.
వన్డే, టీ20ల్లో జట్టును విజయవంతంగా నడిపించిన ధోనీ.. టెస్టుల్లో మాత్రం ఆ స్థాయిలో జట్టుని నడిపించలేకపోయాడని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అందులో పేర్కొన్నాడు. 'ఎ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్' పేరుతో ఇటీవల గంగూలీ తన ఆత్మకథని పుస్తక రూపంలో విడుదల చేశాడు.
దీని ప్రచారంలో భాగంగా ఓ మీడియా సంస్థకి ఈ మాజీ కెప్టెన్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సమయంలోనే 'క్రికెట్ ప్రపంచంలోనే మేటి కెప్టెన్ ఎవరు..?' అనే ప్రశ్న గంగూలీకి ఎదురవగా.. మహేంద్రసింగ్ ధోనీ, విరాట్ కోహ్లి కెప్టెన్సీ ఘనతల గురించి మాట్లాడి చివరికి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ పేరు చెప్పాడు.
'మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లి అద్భుతమైన కెప్టెన్లు. వారి మధ్య పోలికలు తీయాలంటే చాలా కష్టం. అయితే.. కెప్టెన్గా ధోనీ చాలా ప్రత్యేకం. వన్డే, టీ20ల్లో అతను సాధించిన ఘనతలు అమోఘం. కానీ.. టెస్టు క్రికెట్లో మాత్రం కెప్టెన్గా ధోనీ ఇంకొంత మెరుగైన ప్రదర్శన చేసుండాల్సింది. ప్రస్తుతం మంచి కెప్టెన్గా ఎదిగే లక్షణాలు విరాట్ కోహ్లీకి ఉన్నాయి. అయితే.. నా వరకు మేటి కెప్టెన్ అంటే ఆస్ట్రేలియా దిగ్గజం స్టీవ్వానే' అని గంగూలీ వివరించాడు.