కుమార్తె జీవాతో కలిసి మైదానంలో సందడి చేసిన ధోని
మ్యాచ్ అనంతరం అవార్డుల ప్రజంటేషన్ జరుగుతున్న సమయంలో మైదానంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ధోని తన కుమార్తె జీవాతో కలిసి మైదానంలో ఆడుకుంటూ కాసేపు సందడి చేశాడు. ఆ సమయంలో జీవా తన తండ్రి ధోనీ తలపై ఉన్న టోపీ తీయడం ఆ తర్వాత పెడుతూ కనిపించింది.

ఆనందంతో గెంతులేస్తూ కనిపించిన జీవా
ఆ తర్వాత ధోని... జీవాతో ఏదో మాట్లాడటంతో జీవా ఆనందంతో గెంతులేస్తూ కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోని చెన్నై యూనివర్స్ ట్విట్టర్లో అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోని చూసిన అభిమానులు సరదాగా కామెంట్లు పెడుతున్నారు. కాగా, రెండేళ్ల నిషేధం తర్వాత ఈ ఏడాది ఐపీఎల్లో పునరాగమనం చేసిన చెన్నై ప్లేఆఫ్కు చేరుకుంది.

వాంఖడెలో క్వాలిఫయిర్ - 1
ప్లేఆఫ్లో భాగంగా మంగళవారం ధోని నాయకత్వంలోని చెన్నై జట్టు సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది. ముంబైలోని వాంఖడే మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది. కాగా, ఆదివారం రాత్రి పంజాబ్తో జరిగిన మ్యాచ్లో సురేశ్ రైనా (61 నాటౌట్) చేలరేగడంతో పంజాబ్పై 5 వికెట్ల తేడాతో చెన్నై అలవోక విజయాన్ని నమోదు చేసింది.

153 పరుగులకు ఆలౌటైన పంజాబ్
అంతకముందు కరుణ్ నాయర్(54) హాఫ్ సెంచరీ సాధించినా.. మిగిలిన బ్యాట్స్మెన్ విఫలమవడంతో 19.4 ఓవర్లోనే పంజాబ్ 153 పరుగులకు ఆలౌటైంది. దీంతో 154 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్లు అంబటి రాయుడు (1), డుప్లెసిస్ (14) విఫలమైనా.. ప్రయోగాత్మకంగా బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వచ్చిన హర్భజన్ సింగ్ (19), దీపక్ చాహర్ (39) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు.

రైనాతో కలిసి ధోని కీలకపాత్ర
కీలక సమయంలో వీరిద్దరూ పెవిలియన్ చేరినప్పటికీ, చివర్లో సురేశ్ రైనాతో కలిసి ధోని (16 నాటౌట్) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో చెన్నై రెండో స్థానంలో నిలవగా... ఏడో స్థానంలో నిలిచిన పంజాబ్ టోర్నీ నుంచి నిష్క్రమించడంతో మిగిలిన నాలుగో ప్లేఆఫ్ బెర్తు రాజస్థాన్ రాయల్స్కి ఖాయమైంది.


Click it and Unblock the Notifications












