వన్డేల్లో సచిన్, ద్రవిడ్ తర్వాత ధోనియే: అజహరుద్దీన్ రికార్డుతో సమం


హైదరాబాద్: మౌంట్ మాంగనూయ్లోని బే ఓవల్ స్టేడియంలో న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో వన్డేతో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. శనివారం ప్రారంభమైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
దీంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఔటైన తర్వాత ఐదో స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన ధోని 33 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 48 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. చివర్లో ధోని మెరుపులు మెరిపించడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 324 పరుగులు చేయగలిగింది.

భారత్ తరఫున అత్యధిక వన్డేల్లో
ఈరోజు మ్యాచ్ ఆడటం ద్వారా భారత్ తరఫున అత్యధిక వన్డేల్లో ప్రాతినిథ్యం వహించిన మూడో క్రికెటర్గా ధోని రికార్డు నెలకొల్పాడు. డిసెంబరు 23, 2004న బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్తో అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేసిన ధోని ఇప్పటివరకు భారత్ తరుపున 334 వన్డేలు ఆడాడు.

అగ్రస్థానంలో సచిన్
నిజానికి తన కెరీర్లో ఇప్పటికే 337 వన్డే మ్యాచ్లు ఆడినప్పటికీ ఇందులో మూడు మ్యాచ్లు ఆసియా ఎలెవన్ తరఫున ఆడినవి కావడం విశేషం. భారత్ తరఫున అత్యధిక వన్డేలాడిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ 463 వన్డేలతో అగ్రస్థానంలో ఉండగా ఆ తర్వాత రాహుల్ ద్రవిడ్ 340 మ్యాచ్లతో ఉన్నాడు.

అజహరుద్దీన్ సరసన ధోని
తాజా వన్డేతో ఈ జాబితాలో 334 మ్యాచ్లతో మూడో స్థానంలోకి ఎగబాకిన ధోని... మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ సరసన నిలిచాడు. 2014లో టెస్టు క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించిన ధోని అప్పటి నుంచి కేవలం వన్డే, టీ20ల్లో మాత్రమే ఆడుతున్నాడు. ఈ ఏడాది మే నెలలో వరల్డ్కప్ ముగిసిన తర్వాత ధోని రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications