రాంచీ: భారత క్రికెట్ జట్టు మాజీ కేప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ.. కొంతకాలంగా ఓ ఆయుర్వేద వైద్యుడి వద్ద చికిత్స తీసుకుంటోన్నారు. జార్ఖండ్ రాజధాని రాంచీకి సమీపంలో ఉండే గ్రామంలో ఈ చికిత్స సాగుతోంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగిన తరువాత వ్యక్తిగత జీవితానికి, కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తోన్నారు. అడ్వర్టయిజ్మెంట్లల్లో నటిస్తోన్నారు. ఐపీఎల్ టోర్నమెంట్లల్లో మెరుస్తున్నారు.
ఇది తప్పితే- పెద్దగా బాహ్య ప్రపంచం ముందుకు రావట్లేదు ధోనీ. ఇటీవలే తన స్నేహితుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. అప్పట్లో ఆ ఫొటోలు వైరల్గా మారాయి. ఇప్పుడు తాజాగా రాంచీ సమీపంలోని ఓ గ్రామానికి ఆయన తరచూ వెళ్తోన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యాయి. దీనికి కారణం- ఆ గ్రామానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు వైద్యబంధన్ సింగ్ ఖర్వార్ను కలుసుకోవడానికి వెళ్తుండటమే.
కొంతకాలంగా ధోనీ.. మోకాలి నొప్పితో బాధపడుతున్నాడని, దీనికి చికిత్స కోసం ఆయుర్వేద వైద్యుడిని కలుస్తున్నారని చెబుతున్నారు. దీనికోసం మూలికా వైద్యాన్ని తీసుకుంటున్నాడని, ఒక్కో డోస్కు 40 రూపాయలను చెల్లిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాంచీకి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ గ్రామం. పేరు కతింగ్ కేల, లాపుంగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. 28 సంవత్సరాలుగా ధోనీ.. సింగ్ ఖర్వార్ వద్ద చికిత్స తీసుకుంటున్నాడు.
తన వద్ద చికిత్స కోసం ధోనీ ఓ సామాన్యుడిలా తరచూ వస్తుంటాడని ఖర్వార్ చెప్పారు. ఓ సెలెబ్రిటీ అనే గర్వం అతనిలో కొంచెం కూడా కనిపించదని అన్నారు. ప్రతి నాలుగు రోజులకోసారి మోకాలి నొప్పికి చికిత్స కోసం వస్తుంటారని అన్నారు. ధోనీ వచ్చాడనే విషయం తెలిసిన వెంటనే గ్రామస్తులు తన ఆసుపత్రికి చేరుకుంటారని, వారికి నిరాశకు గురి చేయకుండా సెల్ఫీలు దిగుతుంటారని, వారితో మాట్లాడుతుంటారని చెప్పారు.
ధోనీ కుటుంబ వైద్యుడిగా ఖార్వర్కు పేరుంది. తల్లిదండ్రులు కూడా కతింగ్ కేల వెళ్లి.. ఖర్వార్ వద్ద చికిత్స తీసుకుంటుంటారని స్థానిక మీడియా తెలిపింది. మోకాలి నొప్పి మినహా ధోనీ ఆరోగ్యం బాగుందని, అతను ఎలాంటి అనారోగ్యానికి గురి కాలేదని పేర్కొంది. ఆయుర్వేద చికిత్స తీసుకోవడం మొదలు పెట్టిన తరువాత నొప్పి నుంచి ఉపశమనం కలిగినట్లు ధోనీ వ్యాఖ్యానించినట్లు జార్ఖండ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.