హైదరాబాద్: ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా జరిగిన రెండో వన్డేలో పేలవ ప్రదర్శనతో గత కొన్ని రోజులుగా టీమిండియా మాజీ కెప్టెన్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. లార్డ్స్ వేదికగా జరిగిన ఈ వన్డేలో ధోని తన సహాజశైలికి భిన్నంగా ఆడటంతో కేవలం 37 పరుగులు మాత్రమే చేశాడు.
దీంతో ధోనిపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఇక, లీడ్స్ వేదికగా జరిగిన మూడో వన్డేలో 66 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 42 పరుగులు చేసి ఫరవాలేదనిపించాడు. అయితే, ఈ మ్యాచ్లో మిడిలార్డర్ బ్యాటింగ్ వైఫల్యంతో పాటు, బౌలర్లు సైతం మెరుగైన ప్రదర్శన చేయకపోవడంతో భారత్ ఓటమిపాలైంది.
దీంతో మూడు వన్డేల సిరిస్ను టీమిండియా 2-1తేడాతో చేజార్చుకుంది. వన్డే సిరిస్ కోల్పోయామన్న బాధలో ఉన్నప్పటికీ... మ్యాచ్ అనంతరం బస్సు ఎక్కే క్రమంలో ధోని తన గ్లోవ్స్ను ఓ అభిమానికి గిప్ట్గా బహుకరించాడంట. ఈ విషయాన్ని టీమిండియా ఫ్యాన్ క్లబ్ "లాంక్షైర్ భారత్ ఆర్మీ" ట్విట్టర్లో వెల్లడించింది.
ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా ఎక్కడ మ్యాచ్లు ఆడుతున్నా... ఈ క్లబ్కు చెందిన మెంబర్స్ కొంత మంది మ్యాచ్లకు హాజరై టీమిండియాకు తమ మద్దతుని తెలుపుతున్నారు. ఈ క్రమంలో మూడో వన్డే ముగిసిన తర్వాత హోటల్కు చేరుకునేందుకు గాను బస్సు ఎక్కే సమయంలో ధోని తన గ్లోవ్స్ను ఓ అభిమానికి ఇచ్చాడని ట్విట్టర్లో పేర్కొంది.
@msdhoni also gifted his gloves to one of his fan while boarding the bus so another hint. #ENGvsIND. Is one of the great finishers of the game retiring? @imVkohli @IndianCricketTm
— Lancashire Bharat Army (@bharatarmylancs) July 17, 2018
కాగా, ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్ పర్యటన ధోనికి ఏమాత్రం కలిసిరాలేదు. ముఖ్యంగా ఈ పర్యటనలో ధోని తీవ్ర విమర్శలు పాలయ్యాడు. మ్యాచ్లను ముగించడంలో ధోని పూర్తిగా విఫలమయ్యాడు. అయితే ఈ పర్యటనలో వన్డేల్లో ధోని 10వేల పరుగుల మైలురాయిని అందుకోవడం విశేషం.
అంతేకాదు అతి తక్కవ ఇన్నింగ్స్లో ఈ క్లబ్లో చేరిన క్రికెటర్ల సరసన ధోనీ నిలిచాడు. 51.5 యావరేజ్తో ఈ మైలురాయిని ధోని సాధించాడు. టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ తర్వాత పదివేల పరుగులు చేసిన నాలుగో భారత క్రికెటర్గా ధోనీ ఘనత సాధించాడు.
ఈ ఘనతను ధోనీ 273 ఇన్నింగ్స్లో సాధించాడు. అతి తక్కువ ఇన్నింగ్స్లో పదివేల పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలోనూ టెండూల్కర్ మొదటి స్థానంలో ఉన్నారు. సచిన్ ఈ ఫీట్ని 259 ఇన్నింగ్స్లో సాధించగా.. ఆ తర్వాత స్థానంలో 263 ఇన్నింగ్స్తో గంగూలీ, 266 ఇన్నింగ్స్తో రికీ పాంటింగ్, 272 ఇన్నింగ్స్తో జాక్వెస్ కలీస్, ఆ తర్వాతి స్థానంలో 273 ఇన్నింగ్స్తో ధోని నిలిచాడు.