
హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ని దృష్టిలో పెట్టుకుని టీమిండియా ప్రధాన బౌలర్లను ఐపీఎల్లో ఆడించకుండా విశ్రాంతి ఇవ్వాలని కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇటీవలే బీసీసీఐకి సూచించిన సంగతి తెలిసిందే.
అయితే, కోహ్లీ వ్యాఖ్యలపై ధోని తనదైన శైలిలో స్పందించాడు. ఇండియా సిమెంట్స్ 70 ఏళ్ల ప్రస్థానం, ఆ సంస్థతో శ్రీనివాసన్ 50 ఏళ్ల అనుబంధాన్ని పురస్కరించుకొని 'డిఫైయింగ్ ది పరాడిగమ్'ను శుక్రవారం చెన్నైలో విడుదల చేశారు. శ్రీనివాసన్పై రూపొందించిన ఈ పుస్తకాన్ని తమిళనాడు సీఎం పళనిస్వామి విడుదల చేయగా, తొలి కాపీని ధోని అందుకున్నాడు.
ఈ సందర్భంగా ధోని వచ్చే ఏడాది జరిగే వరల్డ్ కప్ గురించి మాట్లాడాడు. ఈ క్రమంలో ప్రధాన బౌలర్లకి విశ్రాంతినివ్వాలనే అంశం చర్చకురాగా ఐపీఎల్లో వారిని కొన్ని మ్యాచ్లు ఆడిస్తే మంచిదని ధోని సూచించాడు. "ప్రపంచకప్కి ముందు భారత బౌలర్లు గాయపడకుండా చూసుకోవడం మంచిదే" అని ధోని అన్నాడు.
"అలా అని వారికి పూర్తిగా రెస్ట్ ఇస్తే మ్యాచ్ కామెంటేటర్లు లయ కోల్పోయారంటూ వ్యాఖ్యానిస్తారు. ఒకవేళ ఎక్కువ మ్యాచ్లు ఆడించామంటే? బాగా అలసిపోయారని పెదవి విరుస్తారు. దీనిని బట్టి బ్యాలెన్స్ చేయడం ఉత్తమం. వరల్డ్ కప్కి ముందు బౌలర్లని ఐపీఎల్లో ఆడించాలనేది మంచి ఆలోచనే. వారు లయ అందుకునేందుకు అక్కడ చక్కటి అవకాశం దొరుకుతుంది" అని ధోని చెప్పుకొచ్చాడు.
ఇదిలా ఉంటే, వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు తమ స్టార్ ప్లేయర్లను ఐపీఎల్ 2019 సీజన్కి దూరంగా ఉండాలని సూచించిన సంగతి తెలిసిందే. మరోవైపు న్యూజిలాండ్ మాత్రం తమ ఆటగాళ్లకి పూర్తి స్థాయిలో ఐపీఎల్ సీజన్ ఆడేందుకు అంగీకరించింది. కాగా, ఈ కార్యక్రమానికి కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రావిడ్, గంభీర్, సెహ్వాగ్, శ్రీనాథ్, యువరాజ్ సింగ్ తదితర క్రికెటర్లు పాల్గొన్నారు.