ధోనీకి శుభారంభం దక్కలేదు:
2005, ఏప్రిల్ 5న విశాఖ వేదికగా పాకిస్థాన్పై ఎంఎస్ ధోనీ తన తొలి సెంచరీని బాదాడు. 123 బంతుల్లో 148 పరుగులు చేసాడు. ఈ సందర్భంగా ధోనీ కెరీర్ తొలినాళ్లలో జరిగిన విషయాల గురించి ఆశిష్ నెహ్రా తాజాగా మాట్లాడారు. ' పాకిస్థాన్పై ఆడిన ఆ ఒక్క ఇన్నింగ్స్తో టీమిండియాకు ఉత్తమ వికెట్ కీపర్ బ్యాట్స్మన్ దొరికాడని భావించారంతా. అయితే ఆదిలో ధోనీకి శుభారంభం దక్కలేదు. కానీ ఆత్మవిశ్వాసంతో ఆడిన ఆ ఇన్నింగ్స్తో జట్టులో కీలక ఆటగాడిగా మారిపోయాడు. తనపై తనకి ఉన్న విశ్వాసమే అతడి బలం' అని నెహ్రా అన్నారు.
అందుకే అత్యుత్తమ వికెట్కీపర్ అయ్యాడు:
'జట్టులోకి వచ్చినప్పుడు ధోనీ కీపర్గా అత్యుత్తమం కాదు. అతడి కంటే ముందు కిరణ్ మెర్, నయాన్ మోంగియా భారత్కు గొప్ప సేవలు అందించారు. కానీ ఆటపై ఉన్న క్రమశిక్షణ, ఇష్టం, ప్రశాంతత, విశ్వాసం ధోనీని గొప్పవాడిని చేశాయి. తనకి వచ్చిన అవకాశాలను చక్కగా ఉపయోగించుకుని దినేశ్ కార్తీక్, పార్థివ్ పటేల్ కంటే ఎంతో మెరుగని నిరూపించుకున్నాడు. దినేశ్, పార్థివ్ చేయలేనిది ధోనీ చేసాడు కాబట్టి అత్యుత్తమ వికెట్కీపర్ బ్యాట్స్మన్గా నిలిచాడు. పాకిస్థాన్ ఇన్నింగ్స్తో మహీ పరుగుల దాహంతో ఉన్నాడని తెలిసింది. అయితే ఆ సిరీస్లో మిగిలిన మ్యాచ్ల్లో ఓడినా మాకు ధోనీ దొరికాడు' అని నెహ్రా పేర్కొన్నారు.
కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టాడు:
2005, ఏప్రిల్ 5న విశాఖ తీరానా ధోనీ విధ్వంసం సృష్టించాడు. పాకిస్థాన్తో జరిగిన ఆ మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆ క్షణమే ధోనీ అనే పేరు యావత్ క్రికెట్ ప్రపంచానికి తెలిసింది. అప్పటికే మూడుసార్లు వచ్చిన అవకాశాలను చేజార్చుకున్న మహీ.. తప్పక ఆడాల్సిన మ్యాచ్లో చెలరేగాడు. దీంతో అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఆపై మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ నుంచి భారత పగ్గాలు అందుకున్న ధోనీ.. క్రికెట్లో ఎన్నో రికార్డులు సృష్టించాడు. టీమిండియాకు టీ20, వన్డే ప్రపంచకప్లను అందించాడు. ఉత్తమ సారథి, ఫినిషర్గా చిరస్మరణీయ విజయాలు సాధించాడు.
సహనం కోల్పోయా:
'అహ్మదాబాద్లో జరిగిన నాలుగో వన్డే మ్యాచ్లో నేను వేసిన బంతి షాహిద్ అఫ్రిదీ బ్యాట్ ఎడ్జ్ తీసుకొని ఫస్ట్ స్లిప్లో ఉన్న ద్రవిడ్.. కీపర్ ధోనీ మధ్యలో నుంచి వెళ్లింది. దీంతో అసహానానికి గురైన నేను ధోనీ, ద్రవిడ్పై అరిచాను. ఆ రోజు అలా ప్రవర్తించడంపై ఎన్నోసార్లు చింతించాను. ఇప్పటికీ ఆ ఘటనపై సంతృప్తిగా లేను. కానీ ఆ బంతికి ముందే అఫ్రిదీ నా బౌలింగ్లో సిక్సర్ బాదాడు. భారత్-పాక్ మ్యాచ్ అంటే మాములుగానే ఒత్తిడి ఉంటుంది. అలాంటిది దొరికిన మంచి అవకాశం చేజారడంతో సహనం కోల్పోయా. ఇలాంటి సమయంలో ఏ క్రికెటర్ అయినా కూడా అలానే ప్రవర్తిస్తాడు. ఈ ఘటన తర్వాత ధోనీ, ద్రవిడ్ నాతో మామూలుగానే ఉన్నారు. కానీ నేను అలా ప్రవర్తించి ఉండాల్సింది కాదు' అని నెహ్రా చెప్పుకొచ్చారు.