
ముంబై: భారత మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ బయోపిక్ 'ధోనీ అన్టోల్డ్ స్టోరీ'కథానాయకుడు, బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ (34) ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొంతకాలంగా డిప్రెషన్తో బాధపడుతున్న అతను ఆదివారం ముంబై బాంద్రాలోని తన ఇంట్లో ఉరి వేసుకున్నాడు. ఎంఎస్ ధోనీ అన్టోల్డ్ స్టోరీలో ధోనీ పాత్ర పోషించిన రాజ్పుత్ క్రికెట్ అభిమానుల అందరికి సుపరిచతమే. అతని అకాల మరణంతో ధోనీ ఫ్యాన్స్ దు:ఖసాగరంలో మునిగిపోయారు.
'కై పో చే' అనే చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సుశాంత్ చివరి చిత్రం 'చిచ్చోర్'. లాక్ డౌన్ నేపథ్యంలో బాంద్రాలోని తన నివాసంలో ఒంటరిగా ఉంటున్నాడు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని భావిస్తున్నారు. కొన్నిరోజుల క్రితం సుశాంత్ మాజీ మేనేజర్ దిశా సలియా కూడా ఆత్మహత్య చేసుకుంది. ఆ ఘటన జరిగిన కొన్నాళ్లకే సుశాంత్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇక సుశాంత్ ఆత్మహత్య పట్ల ధోనీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. భారత క్రికెటర్లు కూడా అతని మృతికి సంతాపం తెలిపుతున్నారు.
'అద్భుత నైపుణ్యం కలిగిన యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం షాక్కు గురిచేసింది. బాధను కలిగిస్తోంది. అతని కుటుంబ సభ్యులకు నా ప్రగాఢసానుభూతి తెలియజేస్తున్న. సుశాంత్ ఆత్మకు శాంతి కలగాలి కోరుకుంటున్నా'-సచిన్ టెండూల్కర్
'జీవితం చాలా సున్నితమైపోయింది. ఎప్పుడూ ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదు కాస్త దయగా ఉండండి. సుశాంత్ రాజ్పుత్ సింగ్ ఆత్మకు శాంతి కలగాలి'- వీరేంద్ర సెహ్వాగ్
'దయచేసి ఇది అసత్య వార్త అని ఎవరైనా చెప్పండి. సుశాంత్ రాజ్పుత్ సింగ్ ఇక లేడనే వార్తను నమ్మలేకపోతున్నా. వారి కుటుంబానికి నా సానుభూతి.'-హర్భజన్ సింగ్
'సుశాంత్ సింగ్ మరణ వార్త షాక్కు గురిచేసింది. మహీ బయోపిక్ సందర్భంగా ఎన్నోసార్లు అతన్ని కలిసా. సరదాగా గడిపా. ఓ అందగాడిని కోల్పోయాం. ఎప్పుడూ నవ్వుతూనే ఉండే నటుడు. ఓంశాంతి'- సురేశ్ రైనా