మహిమలు ఒకటా రెండా..
అవును మరి అతని ‘మహి'మలు ఒకటా రెండా.. అనుకున్నదే తడువుగా సిక్సర్లు కొట్టేసినా.. రెప్పపాటులో స్టంపింగ్స్ చేసినా.. వికెట్లను చూడకుండానే రనౌట్లు చేసినా.. ఇప్పటికీ ఎందరికో అంతుచిక్కని డీఆర్ఎస్ను ధోనీ రివ్యూ సిస్టమ్ అనేట్టుగా మార్చేసినా.. సరికొత్త ఆలోచనలతో అద్భుతాలు సృష్టించినా అతనికే చెల్లింది. అంతేనా.. కుర్రాళ్ల ఆటగా ముద్రపడ్డ ఐపీఎల్లో ‘డ్యాడ్స్ ఆర్మీ'తో మూడుసార్లు టైటిల్ కొట్టి లీగ్లో చెన్నైని మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్గా మార్చేసినా.. ఎంతో మంది కుర్రాళ్లను చాంపియన్లుగా తీర్చిదిద్దినా.. అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ భారత్కు టీ20, వన్డే, వరల్డ్కప్, చాంపియన్స్ ట్రోఫీ అందించినా.. అతనికే సాధ్యమైంది. అలాంటి ఓ గొప్ప క్రికెటర్ అనామక ఆటగాడిలా.. చడి చప్పుడు లేకుండా వీడ్కోలు పలకడం ఎవరికీ ఏ మాత్రం నచ్చలేదు. అతని నిర్ణయం యావత్ క్రికెట్ అభిమానులను దు:ఖ సాగరంలో ముంచింది.
గోల్డెన్ డకౌట్తో ప్రారంభించి..
సౌరవ్ గంగూలీ సారథ్యంలో 2004లో బంగ్లాదేశ్పై వన్డే అరంగేట్రం చేసిన ఈ జార్ఖండ్ డైనమైట్ జర్నీ గోల్డెన్ డకౌట్తో మొదలైనా.. తర్వాత దేశ క్రికెట్ గతినే మార్చే స్థాయికి ఎదిగింది. అన్ని ఫార్మాట్లలో కలిపి 17266 రన్స్ చేసిన 38 ఏళ్ల మహీఇప్పటిదాకా 350 వన్డేలు, 90 టెస్ట్లు, 98 టీ20ల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించాడు. 829 ఔట్లలో పాలుపంచుకొని వరల్డ్ బెస్ట్ కీపర్లలో ఒకడిగా ఇండియా బెస్ట్గా వెలుగొందాడు.
చిరస్మరణీయ సిక్స్తో..
ఒత్తిడిలో మరింత కూల్గా ఉండే ధోనీ కెప్టెన్గా ఎన్నో ఘనతలు సాధించాడు. అతని నాయకత్వంలో లిమిటెడ్ ఓవర్లలో ఇండియా తిరుగులేని శక్తిగా ఎదిగింది. 2007లో టీ20 ప్రపంచకప్ సాధించి దేశ క్రికెట్కు సరికొత్త బాట చూపిన రాంచీ వీరుడు.. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్తో పాటు చిరకాలం గుర్తుండిపోయే సిక్సర్తో 2011 ప్రపంచకప్తో యావత్ దేశం ఉప్పొంగేలా చేశాడు.
ఏకైక సారథిగా..
2013లో చాంపియన్ ట్రోఫీ కూడా సాధించి ఐసీసీ మూడు మేజర్ టైటిళ్లు గెలిచిన ఏకైక కెప్టెన్గా అందరి ప్రశంసలు అందుకున్నాడు. అంతేకాదు టెస్టులు, వన్డేల్లో భారత్కు నంబర్ వన్ ర్యాంక్ సాధించిపెట్టాడు. ఐపీఎల్లోనూ మహేంద్రుడిదే హవా. అతని కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ మూడు టైటిల్స్ అందుకుంది. చాంపియన్స్ లీగ్లో రెండు సార్లు విజేతగా నిలిచింది.
అదో చేదు జ్ఞాపకం..
టెస్ట్లకు వీడ్కోలు పలికి కెప్టెన్సీ కోహ్లీకి అప్పగించి వైట్ బాల్ క్రికెట్లో జట్టుకు పెద్దన్నగా ఉంటున్న మహీ కెరీర్లో మొన్నటి వరల్డ్కప్ ఓ చేదు జ్ఞాపకం. న్యూజిలాండ్తో సెమీస్లో రనౌటై భారత్ను గెలిపించలేకపోయిన బాధలో ధోనీ కంట కన్నీరు ఫ్యాన్స్ను కదిలించింది. ఆ మెగా టోర్నీ తర్వాత ఆటకు మహీ దూరం కాగా.. టఅతని రిటైర్మెంట్ గురించి రోజుకో పుకారు షికారు చేసింది. ఐపీఎల్ ప్రాక్టీస్ సెషన్లో పాల్గొని ఆశలు రేకెత్తించిన మహీ మళ్లీ మైదానంలోకి రావాలని కోట్లాది మంది అభిమానులు ఎదురు చూసారు.. టీ20 ప్రపంచకప్ అందుకొని సచిన్ టెండూల్కర్ తరహాలో ఆటకు సగర్వంగా వీడ్కోలు పలికితే చూడాలని కలలు కన్నారు. కానీ కరోనా పుణ్యమా టీ20 ప్రపంచకప్ వచ్చే ఏడాదికి వాయిదా పడటంతో అందరి కలలు కల్లలయ్యాయి.