|
2016 వరల్డ్ టీ20లో ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం
2016 వరల్డ్ టీ20లో ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం సాధించిన ఫోటోని కెప్టెన్ విరాట్ కోహ్లీ గురువారం అభిమానులతో పంచుకున్నాడు. "ఆ మ్యాచ్ను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ మనిషి ఫిట్నెస్ టెస్ట్లో పరిగెత్తించినట్టు నన్ను పరిగెత్తించాడు" అంటూ ధోనీని ట్యాగ్ చేస్తూ విరాట్ కోహ్లీ కామెంట్ పెట్టాడు.
|
కోహ్లీ చేసిన ఆ ట్వీట్
కోహ్లీ చేసిన ఆ ట్వీట్ 2019లో ఎక్కువ మంది రీ ట్వీట్ చేసిన ట్వీట్గా నిలిచినట్లు ట్విట్టర్ ఇండియా మంగళవారం ప్రకటించింది. క్రీడల్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన ఈ ట్వీట్ ప్రజల హృదయాలను దొంగిలించడంతో పాటు అత్యధికంగా రీట్వీట్ చేసిన ట్వీట్గా నిలిచింది.
ఈ ఏడాది స్పోర్ట్స్లో ధోని రిటైర్మెంటే ప్రధాన చర్చ
నిజానికి, భారత క్రికెట్ అభిమానులు ఎక్కువగా చర్చించుకున్న ప్రధాన అంశం ధోని రిటైర్మెంట్. ఇంగ్లాండ్లో వన్డే వరల్డ్కప్ ముగిసిన తర్వాత ధోని అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతాడంటూ రూమర్లు వచ్చాయి. అదే సమయంలో వరల్డ్కప్ తర్వాత క్రికెట్కు ధోని రెండు నెలలు విరాం ప్రకటించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. చివరకు ధోని రిటైర్మెంట్ వార్తలపై అతడి భార్య సాక్షితో పాటు చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కూడా ఖండించాల్సి వచ్చింది.
ఖండించిన ధోని భార్య, ఎమ్మస్కే ప్రసాద్
చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కూడా ఆ వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పాడు. అసలు ఆ ట్వీట్ ఎందుకు చేశానో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆ తర్వాత వివరణ ఇచ్చుకోవడం విశేషం. "ఇంట్లో కూర్చొని సాధారణంగా ఓ ఫొటోను పోస్ట్ చేశాను. నా మదిలో ఏమీ లేదు. కేవలం నేను ఆనాటి జ్ఞాపకాన్ని ఒకసారి గుర్తు చేసుకున్నానంతే. అయితే, అది ఒక పెద్ద వార్తగా మారుతుందని అనుకోలేదు. ఇది నాకో పాఠాన్ని నేర్పింది. మనం ఆలోచించే విధంగా ప్రపంచం ఆలోచించదని తెలిసింది" అని కోహ్లీ తెలిపాడు.
ఆ ట్వీట్పై వివరణ ఇచ్చిన కోహ్లీ
"నాకు ఆ మ్యాచ్ ఇప్పటికీ గుర్తుంది. ఆ మ్యాచ్పై ఇప్పటి వరకూ నేనేమీ మాట్లాడలేదు. అందుకే పోస్ట్ చేయాలని భావించి చేశాను. నేను చేసిన ట్వీట్.. ధోనికి రిటైర్మెంట్కు సంబంధించినదే అని వార్త రావడం బాధాకరం. ధోని రిటైర్మెంట్ వార్తల్లో నిజం లేదు" అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఇప్పటికే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని.. పరిమిత ఓవర్ల క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు.