హైదరాబాద్: ఎవరూ లేని సమయంలో తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడేందుకు యత్నించింది షమీ భార్య, దానికి సహాయం చేసిన వారే నిరాకరించడంతో పథకం బెడిసికొట్టింది. వివరాల్లొకి వెళితే.. భారత క్రికెట్ జట్టు పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ మరోసారి పోలీసుల్ని ఆశ్రయించింది. షమీ సొంతూరైన ఉత్తరప్రదేశ్లోని సహస్ గ్రామానికి వెళ్లేందుకు తనకు రక్షణగా రావాలంటూ డిడౌలీ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రామ్సింగ్ కటారియాను కోరింది.
షమీ స్వగ్రామం సహస్ చేరిన అనంతరం షమీ ఇంటి తాళాన్ని పగులగొట్టాలని జహాన్ పోలీసుల్ని డిమాండ్ చేసింది. అయితే ఆమె డిమాండ్ను వారు తోసిపుచ్చారు. ఇంట్లో ఎవరూ లేనందున తాళం పగలగొట్టేందుకు నిరాకరించామని కటారియా స్పష్టం చేశారు.
ఆమెతో పాటు తన రెండేళ్ల కూతురు, లాయర్ జాకీర్ హుస్సేన్ ఉన్నట్లు ఆయన చెప్పారు. జహాన్ ముందస్తు సమాచారం ఇవ్వకుండా తమ గ్రామానికి వచ్చిందని అక్కడే నివాసముంటున్న షమీ బంధువు మొహమ్మద్ జమీర్ తెలిపారు. ఆమెను తన ఇంట్లోకి ఆహ్వానించానని ఆయన చెప్పారు. కానీ షమీ సొంతూరు వెళ్లిన కారణాన్ని చెప్పేందుకు హసీన్ జహాన్ నిరాకరించింది. త్వరలోనే ఆ వివరాలను వెల్లడిస్తానని పేర్కొంది.
జహాన్ భర్తతో గొడవపడి మార్చి 9వ తేదీ నుంచి వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో షమీపై గృహ హింస నిర్భందం కేసుతో పాటు పలు సెక్షన్లపై నాన్ బెయిలబుల్ వారెంట్లతో..కేసులు నమోదు చేశారు. షమీ భార్య అతనిపై మ్యాచ్ ఫిక్సింగ్ కు సైతం పాల్పడ్డాడంటూ ఆరోపించడంతో బీసీసీఐ విచారణ జరిపించి జహాన్ కు ప్రతికూలమైన నివేదిక సమర్పించింది.