
హైదరాబాద్: వరుస ఆరోపణల నేపథ్యంలో షమీ కేసులో విచారణకు బీసీసీఐ జోక్యం చేసుకుంది. దీంతో విచారణ చేపట్టిన నేర విభాగం అధికారులు నిజం రాబట్టేందుకు షమీ భార్యపై ప్రశ్నలు సంధిస్తున్నారు. దీంతో తడబాటుకు గురౌతున్న హసీన్ జహాన్ సునాయాసంగా మాట మార్చేసింది.
భర్తపై వ్యక్తిగత ఆరోపణలతో పాటు కెరీర్కు సంబంధించిన విషయాలపై సైతం మాట్లాడి వివాదాల్లో చిక్కుకున్నట్లైంది షమీ భార్య పరిస్థితి. కానీ బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆమెను విచారణ చేపట్టిన నేపథ్యంలో క్రికెటర్ భార్య మాట మార్చారు. విచారణలో భాగంగా హసీన్ జహాన్ను శనివారం సాయంత్రం అధికారులు పలు అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించారు.
సుమారు మూడు గంటలపాటు జరిగిన విచారణలో తడబాటుకు లోనయింది. కొన్ని ప్రశ్నలకైతే సమాధానం లేక మౌనం వహించడమే వంతైంది. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన భర్త షమీ ఫిక్సింగ్కు పాల్పడ్డాడంటూ తాను ఆరోపించినట్లు వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు హసీన్ జహాన్.
'ఇంగ్గాండ్కు చెందిన మహమ్మద్ అనే వ్యక్తి సాయంతో పాకిస్తాన్కు చెందిన అలిషబా అనే మహిళ నుంచి షమీ డబ్బులు తీసుకున్నాడని మాత్రమే చెప్పాను' అంటోంది షమీ భార్య అంతేగానీ, తనకు అసలు క్రికెట్ ఆట గురించే ఎలాంటి అవగాహన లేదని, అలాంటప్పుడు భర్త షమీ మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడని ఎలా ఆరోపిస్తానని జహాన్ ప్రశ్నించడంపై సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.
షమీ కెరీర్ కు ఏ ఇబ్బంది లేదంటూ క్రికెటర్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా, నగదు, ఆస్థి విషయాలపై షమీ, అతడి భార్య హసీన్ జహాన్ ఫోన్లో వాగ్వాదానికి దిగినట్లు ఆడియో టేపుల్లో గుర్తించినట్లు బీసీసీఐ అవినీతీ నిరోధకశాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు షమీని అధికారులు ఆదివారం విచారించి కొన్ని విషయాలు తెలుసుకున్నారు.