
హైదరాబాద్: టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అతడి భార్య హాసిన్ జహాన్ షమీ మోసగాడని, చాలా మంది అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడని, తనను చంపేందుకు ప్రయత్నించాడని కోల్కతా పోలీసులకు లిఖిత పూర్వక ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
హాసిన్ జహాన్ ఫిర్యాదుతో షమీ, అతడి కుటుంబ సభ్యులు, మరో నలుగురిపై ఐపీసీ (ఐపీసీ) 498-ఎ (మహిళపై భర్త, అతడి కుటుంబ సభ్యుల క్రూరత్వం) సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సెక్షన్ 307 (హత్యాయత్నం), సెక్షన్ 323 (గాయపరచడం), సెక్షన్ 376 (రేప్), సెక్షన్ 506 (నేరపూరిత కుట్ర), సెక్షన్ 328, సెక్షన్ 34ల కింద శుక్రవారం వారిపై కేసులు నమోదు చేశారు.
శుక్రవారం షమీపై కేసు నమోదైన అనంతరం షమీ అందుబాటులో లేకుండా పోయాడు. అంతేకాదు షమీ ఫోన్ స్విచ్ఛాప్ చేసి ఉంది. దీంతో అతడు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. షమీ మొబైల్ లోకెషన్ ప్రకారం చివరి సారిగా ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి అతని పెద్ద సోదరుడితో ఘజియాబాద్ ప్రయాణించినట్లు పోలీసులు గుర్తించారు.
మరోవైపు షమీ కుటుంబానికి చెందిన పలువురు కోల్కతాలోని తన భార్య కుటుంబీకులతో కేసు విషయమై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఘజియాబాద్కు సమీపంలోని ఫిల్కువా ట్రాఫిక్లో షమీ చిక్కుకున్నట్లు కుటుంబ సభ్యుడు ఒకరు తెలిపారు.
మరోవైపు షమీ మాత్రం మీడియాకు దూరంగా ఉండమని తన కుటుంబ సభ్యులకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే షమీ, అతని సోదరుడు ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉంచారు. కేసు విషయమై షమీని గానీ, అతడి కుటుంబ సభ్యులను గానీ ఇప్పటివరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని కోల్కతా పోలీసులు తెలిపారు.
ప్రస్తుతం ఈ కేసును లాల్ బజార్ పోలీస్ స్టేషన్కు చెందిన డిటెక్టివ్ విభాగం తన చేతుల్లోకి తీసుకుంది. షమీ కేసును విమెన్స్ గ్రీవెన్స్ సెల్ ఆధ్వర్యంలో దర్యాప్తు జరపనున్నట్టు కోల్కతా పోలీసులు తెలిపారు. 2012లో కోల్కతా నైట్ రైడర్స్ పార్టీలో జహాన్-షమీలు కలుసుకున్నారు. ఆ తర్వాత ప్రేమలో పడిన వీరు ఏప్రిల్ 7, 2014లో వివాహం చేసుకున్నారు. వీరికి రెండున్నరేళ్ల పాప ఉంది.