ఢాకా: ముక్కోణపు టీ20 సిరీస్లో పసికూన అఫ్ఘనిస్థాన్ అద్భుత ఆటతో అదరగొట్టింది. శనివారం జింబాబ్వేతో జరిగిన తమ తొలి మ్యాచ్లో నజీబుల్లా జద్రాన్ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో అఫ్ఘనిస్థాన్ 28 పరుగుల తేడాతో విజయ భేరి మోగించింది. రషీద్ ఖాన్ నేతృత్వంలోని అఫ్ఘనిస్థాన్ జట్టు మొదటగా బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 197 పరుగుల భారీ స్కోర్ చేసింది. అఫ్గాన్కు మంచి ఆరంభమే లభించింది. ఓపెనర్లు రహమనుల్లా గుర్బాజ్ (43), హజ్రతుల్లా జజాయ్ (13) మొదటి వికెట్ భాగస్వామ్యానికి 57 పరుగులు జోడించారు.
దక్షిణాఫ్రికాతో తొలి టీ20: కుర్రాళ్లతో బరిలోకి ఇరు జట్లు.. ఆరంభం ఎవరిది?
మూడు పరుగుల వ్యవధిలో గుర్బాజ్, జజాయ్ పెవిలియన్ చేరారు. అనంతరం నజీబ్ తారకై (14), అస్గర్ ఆఫ్ఘన్ (14) తక్కువ పరుగులకే ఔట్ అయ్యారు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన నజీబుల్లా జద్రాన్ (30 బంతుల్లో 69 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇటీవలే టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన మొహమ్మద్ నబీ (18 బంతుల్లో 38; 4 సిక్సర్లు) చెలరేగి ఆడారు. వీరి జోరుతో ఆఫ్ఘనిస్తాన్ 16 ఓవర్లలో 4 వికెట్లకు 123 పరుగులు చేసింది. 17వ ఓవర్ చివరి 4 బంతులను నబీ సిక్సర్లు కొట్టగా.. 18వ ఓవర్ తొలి 3 బంతులను జద్రాన్ సిక్సర్లుగా మలిచాడు.
జద్రాన్, నబీ 51 బంతుల్లో 107 పరుగులు జోడించడంతో అఫ్గాన్ భారీ స్కోర్ చేసింది. ఈ జోడి టీ20 ఫార్మాట్లో రెండవ అత్యధిక ఐదవ వికెట్ భాగస్వామ్యంను కూడా నెలకొల్పింది. అనంతరం లక్ష్య ఛేదనలో జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 169 పరుగులకే పరిమితమైంది. బ్రెండన్ టేలర్ (27), రెగిస్ చకబ్వా (42) పరుగులు చేశారు. రషీద్ ఖాన్ (2/29), ఫరీద్ (2/35) ధాటికి నిలువలేకపోయిన జింబాబ్వే.. ఆరంభంలో వికెట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. ఇక చివరలో పోరాడినా ఫలితం లేకపోయింది. జింబాబ్వే ఈ సిరీస్లో వరుసగా రెండో ఓటమి మూటగట్టుకుంది.