
హైదరాబాద్: ప్రత్యర్థి జట్టైనా.. ఒకే దేశ ఆటగాడే. ఇద్దరూ కలిసి జాతీయ క్రికెట్ జట్టులో పాకిస్థాన్ తరపున ఆడిన వాళ్లే. అయినా దేశం పరువుపోతోందన్న విషయాన్ని కూడా పట్టించుకోలేదు. క్రికెట్ ఆడుతుండగానే వ్యక్తిగత దూషణలకు దిగారు వీరిద్దరూ. పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో ఆడుతున్న ఇద్దరు ఆటగాళ్లు అహ్మద్ షెజాద్, మహ్మద్ అమీర్ మైదానంలోనే ఒకరినొకరు దూషించుకున్నారు.
ఐతే వీరిద్దరు పాకిస్థాన్ జాతీయ క్రికెట్ జట్టుకు ఆడిన వారే కావడం గమనార్హం. లీగ్ 22వ మ్యాచ్లో భాగంగా కరాచీ కింగ్స్, ముల్తాన్ సుల్తాన్స్ మధ్య సంఘటన చోటుచేసుకుంది. అంతకుముందు లీగ్19వ మ్యాచ్లో మరో ఇద్దరు పాకిస్థానీ క్రికెటర్లు రహత్ అలీ, ఇమాద్ వసీమ్ గొడవ పడిన విషయం తెలిసిందే.
ముల్తాన్ తరఫున షెజాద్ బ్యాటింగ్ చేస్తుండగా.. కరాచీ బౌలర్ ఆమీర్ బౌలింగ్ చేస్తున్న సమయంలో ఘర్షణ జరిగింది. ఆమీర్, షెజాద్ మాటల యుద్దం కొనసాగుతుండగా కరాచీ కెప్టెన్ షాహిద్ అఫ్రీదీ కలగజేసుకున్నాడు. బౌలింగ్ వేసే స్థానానికి వెళ్లమంటూ ఆమీర్ను సూచించాడు. మరోవైపు షెజాద్ను సైతం సహచర బ్యాట్స్మన్ కుమార సంగక్కర వారించాడు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన కరాచీ 3 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో అఫ్రీదీ సంచలన బౌలింగ్ దెబ్బకు ముల్తాన్ 125 పరుగులకే ఆలౌటైంది.