
హైదరాబాద్: భారత మహిళల వన్డే జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ వన్డేల్లో అరుదైన రికార్డుని సాధించింది. మూడు వన్డేల సిరిస్లో భాగంగా నాగ్పూర్ వేదికగా గురువారం ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో మిథాలీ రాజ్ 124 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 74 నాటౌట్గా నిలిచిన సంగతి తెలిసిందే.
తద్వారా వన్డేల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన మహిళా క్రికెటర్గా చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే క్రికెట్లో ఇప్పటి వరకు అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన రికార్డు ఇంగ్లాండ్ క్రికెటర్ చార్లెట్ ఎడ్వర్డ్స్ పేరిట ఉండగా... ఇప్పుడు దానిని మిథాలీరాజ్ అధిగమించింది.
తాజా హాఫ్ సెంచరీ మిథాలీకి 50వ హాఫ్ సెంచరీ కావడం విశేషం. వన్డేల్లో ఇప్పటికే 6,373 పరుగులు చేసిన మిథాలీ రాజ్.. ఈ ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా గతేడాది నుంచి కొనసాగుతోంది. గురువారం నాగ్పూర్లో జరిగిన మూడో వన్డేలో భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
దీంతో మూడు వన్డేల సిరిస్ను మిథాలీరాజ్ నేతృత్వంలోని భారత మహిళల జట్టు 2-1తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో అద్భుత ప్రదర్శన చేసిన దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించగా... ఈ సిరిస్లో చక్కటి ప్రదర్శన కనబర్చిన స్మృతి మంధాన ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కించుకుంది.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. అనంతరం 202 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళల జట్టులో ఓపెనర్ రోడ్రిగ్స్(2) పరుగుల వద్ద పెవిలియన్కు చేరినా... మరో ఓపెనర్ స్మృతి మంధాన(53) హాఫ్ సెంచరీతో శుభారంభమిచ్చింది.
ఆ తర్వాత మందాన రిటైర్డ్ హార్ట్గా మైదానాన్ని వీడటంతో దీప్తి శర్మ క్రీజులోకి వచ్చింది. అప్పటికే క్రీజులో పాతుకుపోయిన కెప్టెన్ మిథాలీ రాజ్(74 నాటౌట్), దీప్తి శర్మ (54)తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడి 45.2 ఓవర్లలో కేవలం రెండు వికెట్ల మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించారు.