
కొలంబో: శ్రీలంక హెడ్ కోచ్గా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు మిక్కీ ఆర్థర్ నియమితుడయ్యారు. రెండేళ్ల పాటు ఆర్థర్ కోచ్గా కొనసాగేందుకు శ్రీలంక క్రికెట్ బోర్డు గురువారం ఒప్పందం చేసుకుంది. ఈ ఏడాది జరిగిన ప్రపంచకప్లో పేలవమైన ఆటతీరుతో లంక జట్టు ఇంటా, బయటా విమర్శలు ఎదుర్కొంది. దీంతో లంక బోర్డు మొత్తం కోచింగ్ సిబ్బందిని ప్రక్షాళన చేసింది.
లంక హెడ్ కోచ్గా మికీ ఆర్థర్ను నియమించగా.. బ్యాటింగ్ కోచ్గా జింబాబ్వే ఆటగాడు గ్రాంట్ ఫ్లవర్ను నియమించింది. బౌలింగ్ కోచ్గా ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ సకర్, ఫీల్డింగ్ కోచ్గా షేన్ మెక్ డెర్మాట్ను నియమించినట్టు లంక క్రికెట్ కార్యదర్శి మోహన్ డిసిల్వా తెలిపారు. 51 ఏళ్ల మిక్కీ ఆర్థర్ గతంలో ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ జట్లకు కోచ్గా పని చేశారు. ఆర్థర్ విజయవంతంగా నాలుగవ జాతీయ జట్టుకు కోచ్గా ఎంపికయ్యారు.
ప్రపంచకప్ అనంతరం మిక్కీ ఆర్థర్ పాకిస్థాన్ హెడ్ కోచ్ బాధ్యతల నుండి తప్పుకున్నాడు. గత ఆగస్టులో తాత్కాలిక బాద్యతలు చేపట్టిన లంక మాజీ బౌలర్ రుమేష్ రత్నాయకే నుండి ఆర్థర్ బాధ్యతలు అందుకోనున్నారు. 'పాకిస్థాన్తో మూడు సంవత్సరాలు బాగా గడిచాయి. నాకు కొంచెం విరామం అవసరం అనిపించింది. మళ్లీ లంకతో కలవడం ఆనందంగా ఉంది. లంక ఆటగాళ్లలో మంచి ప్రతిభ ఉంది. యువ ఆటగాళ్ల సామర్థ్యాన్ని పెంచాలి' అని ఆర్థర్ చెప్పుకొచ్చాడు.
వచ్చేవారం పాకిస్థాన్తో లంక టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్లో భాగంగా ఇరు జట్లు రెండు టెస్ట్ మ్యాచ్లు ఆడనున్నాయి. ఈ టెస్ట్ సిరీస్తో ఆర్థర్ బాధ్యతలు చేపట్టనున్నాడు. లంక గత ప్రధాన కోచ్ చండికా హతురుసింగ్ ఆగస్టులో తన బాధ్యతల నుండి పక్కకు తప్పుకున్నప్పటికీ.. పదవీవిరమణ చేయడానికి మాత్రం నిరాకరించాడు. మరో ఏడాది కాంట్రాక్టు ఉన్న హతురుసింగ్ భవితవ్యం గురించి మరో వారంలో లంక బోర్డు నిర్ణయం తీసుకోనుంది.