భారత బౌలింగ్ దుర్భేద్యంగానే ఉంది:
తాజాగా ఓ మీడియా సమావేశంలో గ్లెన్ మెక్గ్రాత్ మాట్లాడుతూ... 'టీమిండియా బౌలింగ్ దాడిపై నాకు ఇప్పటికీ ఎంతో విశ్వాసం ఉంది. ఈ మధ్యే కొందరు ఆటగాళ్లు గాయాల బారిన పడ్డారు. ఇషాంత్ శర్మ గాయం నుంచి కోలుకుని ఐదు వికెట్లు తీశాడు. జస్ప్రీత్ బుమ్రా గాయపడే తిరిగొచ్చాడు. భారత బౌలింగ్ దళం దుర్భేద్యంగానే ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎవరూ రాత్రికి రాత్రే ఫామ్ కోల్పోరు' అని అన్నారు. తొలి టెస్టులో ఇషాంత్ ఐదు వికెట్లు తీయగా.. బుమ్రా, మొహమ్మద్ షమీ చెరో వికెట్ పడగొట్టారు.
అతడి కెరీర్ ముగిసిపోయిందనుకున్నా:
'గత రెండేళ్లుగా ఇషాంత్ బౌలింగ్ చేస్తున్న విధానం నమ్మశక్యం కాకుండా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో అతడి కెరీర్ ముగిసిపోయిందనుకున్నా. కానీ.. తనను తానే దిద్దుకుని మరింత వేగంగా దూసుకొచ్చాడు. ఇప్పుడు కట్టుదిట్టంగా బంతులు వేస్తున్నాడు. షమీకి మంచి వేగం ఉంది. తన అనుభవంతో బంతిని చక్కగా స్వింగ్ చేస్తున్నాడు. ఇక బుమ్రా ప్రత్యేకం. తక్కువ రన్నప్తో క్రీజువద్దే ఎక్కువ బలంతో వేగం రాబడుతున్నాడు. బంతిని స్వింగ్ చేస్తున్నాడు. మూడు, నాలుగో స్పెల్లో బంతిపై నియంత్రణ చూపించాడు' అని మెక్గ్రాత్ తెలిపారు.
బ్యాటింగ్ ఇంకా మెరుగ్గా చేయాల్సింది:
'కివీస్లో బంతి ఎక్కువ స్వింగ్ అవుతుంది. బేసిన్ రిజర్వు పిచ్పై పచ్చిక ఇంకా ఎక్కువగా ఉంది. భారత్ టాస్ ఓడిపోయింది. కీలకమైన టాస్ భారీ తేడా చూపించింది. అయితే బ్యాటింగ్ ఇంకా మెరుగ్గా చేయాల్సింది. మరిన్ని పరుగులు చేయాల్సింది. సహనంతో ఉండి సరైన ప్రాంతాల్లో బౌలర్లు బంతులు వేయాలి' అని మెక్గ్రాత్ సూచించారు. భారత్ రెండు ఇన్నింగ్స్ల్లోనూ స్కోరు 200 చేయలేదు.
వాగ్నర్ హెచ్చరికలు:
ఫిబ్రవరి 29 నుంచి క్రైస్ట్చర్చి వేదికగా జరగనున్న రెండో టెస్టుకు ముందే న్యూజిలాండ్ పేసర్ నీల్ వాగ్నర్ కోహ్లీసేనకు హెచ్చరికలు పంపాడు. టీమిండియా బ్యాట్స్మెన్కు మరోసారి ఇబ్బందులు తప్పవన్నాడు. ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించే హెగ్లే ఓవల్ మైదానంలో వేగం, బౌన్స్లతో కూడిన తమ బౌలింగ్ను ఎదుర్కోవడం కష్టమేనన్నాడు. వాగ్నర్ భార్య ఓ పండంటి ఆడ బిడ్డకు జన్మనివ్వడంతో అతడు తొలి టెస్టు నుంచి తప్పుకున్నాడు.రెండో టెస్టులో అతడు ఆడనున్నాడు.