మెల్బోర్న్: ప్రపంచ కప్ టోర్నీ-2015 అవార్డు ప్రదానోత్సవ వేడుకలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. తాజా ప్రపంచ కప్ బ్రాండ్ అంబాసిడర్ అయిన మాస్టర్.. మెల్బోర్న్ మైదానంలో న్యూజిలాండ్-ఆస్ట్రేలియాల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచును ప్రత్యక్షంగా వీక్షించారు.
ఆస్ట్రేలియా విజయానంతరం అవార్డుల ప్రదానోత్సవంలో సచిన్ టెండూల్కర్ అతిథిగా పాల్గొన్నాడు. కాగా, సచిన్ పేరు ప్రస్తావించినప్పుడల్లా మెల్బోర్న్ స్టేడియంలో అభిమానుల కేరింతలు మారుమోగాయి. విజేత అయిన ఆస్ట్రేలియాకు కప్ ఇస్తున్నప్పుడు వచ్చిన ఛీర్స్ కంటే ఎక్కువగా.. సచిన్ పేరు ప్రస్తావించినప్పుడు వచ్చిన అభిమానుల కేరింతలే ఎక్కువగా మారుమోగాయి. దీంతో సచిన్ చిరునవ్వు నవ్వుతూ అభిమానులకు అభివాదం చేశారు.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఫాల్కూనర్కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్', స్టార్క్కు 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' అవార్డులను అందజేశాడు. కాగా, ఐసిసి ఛైర్మన్ ఎన్ శ్రీనివాసన్ అవార్డులను అందజేస్తున్న సమయంలో అతనికి పట్ల అభిమానులు సానుకూలంగా స్పందించలేదు. ఎలాంటి కేరింతలు లేకుండా ఉండిపోయారు.
కాగా, ప్రపంచ కప్ ఫైనల్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలు ఆదివారం తలపడగా.. ఆసిస్ ఏడు వికెట్ల తేడాతో కివీస్ పైన గెలిచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 45 ఓవర్లలో 183 పరుగులు చేసింది. 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసిస్ 33.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. ఏడు వికెట్లతో గెలిచింది. ఇది ఆస్ట్రేలియాకు ఐదో ప్రపంచ కప్.