హైదరాబాద్: పరిమిత ఓవర్ల క్రికెట్లో బౌలర్ నో బాల్ వేస్తే అంపైర్ ఫ్రీహిట్ ఇచ్చే సంగతి తెలిసిందే. ఈ నిబంధనను త్వర్లో టెస్టు క్రికెట్లోనూ అమలు చేయాలని అంతర్జాతీయ క్రికెట్కు మార్గనిర్దేశాలు రూపొందించే మారిల్బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) ప్రతిపాదించింది. తాజాగా బెంగళూరులో జరిగిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సమావేశంలో ఎంసీసీ కొన్ని కీలక ప్రతిపాదనలు చేసింది.
ఇండియా vs ఆస్ట్రేలియా, 5th ODI: తుది జట్టులో చోటు వీరికే!
టెస్టు మ్యాచ్ల్లో వేగం పెంచడం కోసం ఓవర్ల మధ్య, బ్యాట్స్మన్ ఔటైనపుడు, విరామ సమయాల్లో 'టైమర్' ఉపయోగించాలని కూడా ఎంసీసీ సూచించింది. టెస్టులపై ఆసక్తి తగ్గడానికి స్లో ఓవర్రేట్ కారణమని చాలామంది అభిమానులు అభిప్రాయపడిన నేపథ్యంలో ఎంసీసీ ఈ సూచన చేయడం విశేషం.
దీంతో పాటు టెస్టుల్లో వివిధ దేశాల్లో వేర్వేరు బంతుల్ని ఉపయోగించడం కాకుండా.. అన్ని చోట్లా ఒక ప్రామాణిక బంతిని వాడాలని కూడా ఎంసీసీ ప్రతిపాదించింది. ప్రస్తుతం ఇంగ్లాండ్, వెస్టిండీస్ల్లో జరిగే టెస్టుల్లో డ్యూక్ బంతిని వాడుతుండగా.. భారత్లో ఎస్జీ.. మిగతా దేశాల్లో కూకాబుర్రా బంతుల్ని ఉపయోగిస్తున్నారు.
ఇంగ్లాండ్ వేదికగా మే30 నుంచి వరల్డ్ కప్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ వరల్డ్కప్ అనంతరం టెస్టు ఛాంపియన్షిప్ ప్రారంభం కానుంది. ఈ టెస్టు ఛాంపియన్షిప్ నుంచి యావత్ ప్రపంచవ్యాప్తంగా ఒకే బంతిని తీసుకురావాలని ఎంసీసీ సూచించింది. ఈ నిర్ణయాన్ని బీసీసీఐ కట్టుబడుతుందో లేదో చూడాలి.