హైదరాబాద్: సంప్రదాయక టెస్టు క్రికెట్ మనుగడపై ఆందోళన చెందుతున్న అభిమానులకు నిజంగా ఇది శుభవార్తే. టెస్టు క్రికెట్ ప్రాభవం కోల్పోతోందని, టెస్టు క్రికెట్ను చూసేందుకు అభిమానులు పెద్దగా ఆసక్తి చూపడం లేదని ఈ మధ్య తరచూ వార్తలొస్తున్నాయి. అయితే, మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) నిర్వహించిన సర్వేలో మాత్రం 86 శాతం మంది క్రికెట్ అభిమానులు వన్డేల కన్నా టెస్టులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారట.
ఆఖరి ఓవర్లో మూడు పరుగులు చేయలేక... ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి
ఈ విషయాన్ని మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) తెలిపింది. 100 దేశాల్లో 13 వేల మంది అభిమానులతో ఎంసీసీ ఓ సర్వే చేసింది. టెస్టు క్రికెట్ మరింత విజయవంతం కావడానికి ఆ అభిమానులు విలువైన సూచనలూ ఇచ్చారు. ఇందులో పరిమిత ఓవర్ల క్రికెట్తోపాటు తమకు టెస్టులు చూడటం కూడా ఇష్టమేనని 86 శాతం క్రికెట్ అభిమానులు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఎక్కువమంది సుదీర్ఘ ఫార్మాట్పైనే ఆసక్తి చూపిస్తున్నట్లు.. అయితే, మ్యాచ్ టిక్కెట్ల ధరలు మాత్రం తగ్గించాలని కోరుకుంటున్నట్లు ఈ సర్వేలో తేలింది. మ్యాచ్ టికెట్ల వివరాల్ని, ధరతో పాటు ఆన్లైన్లో ఉంచాలి. ప్రస్తుతం ధరల వివరాలే ఉంటున్నాయి. ఎన్ని టికెట్లు ఉన్నాయో ఎవరికీ తెలియడం లేదని ఈ సర్వేలో అభిమానులు తమ సూచనలు అందజేశారు.
అంతేకాదు, ఐదు రోజుల మ్యాచ్ల్ని టీవీల్లో ఉచితంగా వీక్షించేందుకు (ఫ్రీ టు ఎయిర్) అవకాశం ఇవ్వాలని, రోజు మొత్తానికి బదులుగా 'హాఫ్ డే' టిక్కెట్లు విక్రయించాలని సర్వేలో పాల్గొన్న అభిమానులు తెలిపారు. తాజా సర్వేతో టెస్టు క్రికెట్కూ ఆదరణ ఉందని రుజువైందని ఎంసీసీ తెలిపింది. గతేడాది సర్వేలో కూడా 70 శాతం ప్రజలు టెస్టులకు మద్దతు తెలిపారు.